ఇక ముగింపేనా..?

By Medi Samrat  Published on  16 Oct 2019 11:15 AM GMT
ఇక ముగింపేనా..?

దశాబ్దాల అయోధ్య వివాదానికి తెరపడబోతోంది. న్యాయస్థానాల్లో సాగుతున్న ధర్మపోరాటం ముగింపు దశకు చేరింది. వాద వివాదాలు ముగిసి తీర్పు వెలువరించడానికి సర్వోన్నత న్యాయస్థానం సిద్ధమైంది. నవంబర్ రెండో వారం లేదా మూడో వారంలో తీర్పు వెలువరించడానికి సుప్రీం ధర్మాసనం సన్నాహాలు చేస్తోంది. 2.77 ఎకరాల ప్రాంతం ఎవరికి చెందుతుందో నవంబర్ చివరి నాటికి సుప్రీంకోర్టు తేల్చనుంది.

అయోధ్య పూర్వాపరాలు:

అయోధ్య వివాదానికి 130 ఏళ్ల చరిత్ర ఉంది. అయోధ్యను శ్రీరామచంద్రుని జన్మస్థలంగా హిందువులు భావిస్తారు. రామాయణ మహాకావ్యంలోనూ అయోధ్య ప్రస్తావన ఉంది. ఐతే, ఆ స్థలం తమకు చెందుతుందని ముస్లింలు పేర్కొంటారు. 1528లో మొఘల్ చక్రవర్తి బాబర్‌ సైనిక కమాండర్ మీర్ బకీ ఇక్కడ మసీదు నిర్మించాడు. అప్పటి నుంచి బాబ్రీ మసీదు ఉనికిలోకి వచ్చింది. నాటి నుంచి అడపా దడపా రగడ చెలరేగుతూనే ఉంది. కోర్టుకు చేరింది మాత్రం 80వ దశకంలోనే. 1885లో మహంత్ రఘుబర్ దాస్, ఫైజా బాద్‌ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదుకు వెలుపల కట్టడం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఆ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత పెద్దగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఐతే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్లకే అయోధ్యలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. 1949లో వివాదాస్పద రామజన్మభూమి - బాబ్రీ మసీదుకు వెలుపల మధ్య గుమ్మటంలో రామ్ లల్లా విగ్రహాలు వెలిశాయి. ఇది దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 1950లో గోపాల్ సింగ్‌ విశారద్, పరమహంస రామచంద్ర దాస్‌లు ఫైజాబాద్ కోర్టులో పిటిషన్లు వేశారు. రామ్‌లల్లాకు పూజలు చేసుకోవడానికి అనుమతించాలని కోరారు. 1959లో నిర్మోహీ అఖాడా రంగంలోకి దిగింది. వివాదాస్పద స్థలాన్ని తమకు అప్పగించాలని కోరింది. అనంతరం 2 దశాబ్దాల పాటు పెద్దగా కదలిక లేదు. 1981లో సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఇంప్లీడయ్యింది. వివాదాస్పద స్థలంపై హక్కులు తమకు కట్టబెట్టాలని వాదించింది. సున్నీ వక్ఫ్ బోర్డు, బాబ్రీమసీదు పోరాటసమితిలు కూడా పిటిషన్లు వేశాయి. వివాదాస్పద స్థలాన్ని తమకే అప్పగించాలని, అక్కడ ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశాయి.

అయోధ్య వివాదం - వీహెచ్‌పీ పాత్ర:

రాజీవ్ గాంధీ హయాంలో అయోధ్య వ్యవహారం మరో మలుపు తీసుకుంది. అప్పటికే వ్యవహారం విశ్వహిందూపరిషత్ చేతిలోకి వెళ్లిపోయింది. అయోధ్యలో శిలాన్యాస్ నిర్వహించాలని వీహెచ్‌పీ నిర్ణయించింది. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్, శివసేన తదితర హిందూత్వ సంఘాలు రామాలయ నిర్మాణానికి పట్టుబట్టాయి. ఇదే సమయంలో అయోధ్య తలుపులు తెరుచుకోవడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది హిందూత్వ సంఘాల బలాన్ని పెంచింది. 1986లో స్థానిక కోర్టు హిందువుల పూజలకు అనుమతి ఇచ్చింది. ఈ పరిణామాలతో అయోధ్యలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దాంతో అలహాబాద్ హైకోర్టు జోక్యం చేసుకుంది. యధాతథ స్థితి పాటించాలని హైకోర్టు ఆదేశించింది. ఐతే అప్పటికే హిందూత్వ సంఘాలు రామాలయ నిర్మాణంపై తీవ్రంగా పట్టుబట్టాయి. గంగాజల్ యాత్ర, శిలాన్యాస్‌లతో జోరుమీదున్న వీహెచ్‌పీ, రెండో సారి శిలాన్యాస్‌కు సంకల్పించింది. ఇందుకు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ కూడా పూర్తిస్థాయిలో తోడ్పాటు అందించింది. అయోధ్యలో కరసేవ నిర్వహిస్తామని, రామాలయ నిర్మాణం నుంచి వెనక్కి తగ్గబోమని ఆర్‌ఎస్‌ఎస్ ప్రకటించింది.

రామజన్మభూమి వివాదం - బీజేపీకి బలం:

రామజన్మభూమి వివాదం బీజేపీకి బాగా కలసి వచ్చింది. బీజేపీ అగ్రనాయకుడు అద్వానీ నిర్వహించిన రథయాత్రకు దేశవ్యాప్తంగా బలమైన మద్దతు లభించింది. దాంతో రాజకీయంగా కమలదళం పాతుకుపోయింది. ఇది కాంగ్రెస్ పార్టీని కలవరపరిచింది. అయోధ్య వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలో అర్ధంగాక కాంగ్రెస్ పార్టీ సతమతమైంది. 1986లో అయోధ్య తలుపులను రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. విచిత్రంగా 1992 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయింది. నాటి ప్రధాని పీవీ నరసింహారావు, మహంతులు, స్వామీజీలు, మఠాలు, హిందూత్వ సంఘాలతో చర్చల ద్వారా అయోధ్య వ్యవహారాన్ని హైజాక్ చేయడానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే సమయం మించిపోయింది. ఓవైపు మైనార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ, మరోవైపు దేశాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించడానికి కృషి చేసిన పీవీకి, అయోధ్య వివాదంపై పూర్తి సమయం కేటాయించే వీలు లేకుండాపోయింది. దాంతో వివాదం మరింత ముదిరి బాబ్రీ మసీదు విధ్వంసానికి దారి తీసింది.

బాబ్రీ మసీదు విధ్వంసం-దేశవ్యాప్తంగా అల్లర్లు:

1992 డిసెంబర్ 6న అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వివాదాస్పద రామజన్మభూమిలోని గుమ్మటాలను ఆందోళనకారులు కూల్చేశారు. ఇది దేశంలో చిచ్చు రేపింది. దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగి వేలమంది ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోయాయి. 1993లో కేంద్రప్రభుత్వం వివాదాస్పద స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అదే సంవత్సరంలో ఇస్మాయిల్ ఫారూఖీ, అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 1994 అక్టోబర్ 24న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. మసీదు ఇస్లాంలో అంతర్భాగం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయోధ్య న్యాయ ప్రక్రియలో ఇదొక మైలురాయిగా పేర్కొంటారు. ఇక 2002 ఏప్రిల్ నుంచి అలహాబాద్ హై కోర్టులో విచారణ ప్రారంభమైంది. 2010లో హైకోర్టు తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూభాగాన్ని రామ్‌లల్లా విరాజ్‌మాన్, నిర్మోహీ అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డులకు మూడు సమాన భాగాలుగా విభజిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐతే, ఈ మూడు ముక్కల తీర్పు ఎవ్వరినీ సంతృప్తి పరచలేకపోయింది. దాంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. అలాహాబాద్ హైకోర్టు తీర్పుపై 2011లో సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత ఐదేళ్ల పాటు అయోధ్య కేసులో పెద్దగా కదలిక లేదు. 2016లో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి రామాలయ నిర్మాణానికి అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 2017లో నాటి చీఫ్ జస్టిస్ జేఎస్ ఖెహార్, కోర్టు వెలుపల సెటిల్‌మెం ట్‌ను ప్రతిపాదించారు. ఐతే ఇందుకు కక్షిదారులు అంగీకరించలేదు. ఇక 2017 డిసెంబర్‌లో నాటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తుది విచారణ చేపట్టారు. అప్పటికి 30కి పైగా పిటిషన్లు దాఖలు కాగా, 14 పిటిషన్లనే అనుమతించారు.

అయోధ్య కేసు-మధ్యవర్తిత్వం:

2019 ఫిబ్రవరి 26న సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అయోధ్య వివాదాన్ని మధ్యవర్తిత్వంతో పరిష్కరించాలని సుప్రీంకోర్టు సంకల్పించింది. అందు కోసం జస్టిస్ ఖలీఫుల్లా, శ్రీశ్రీ రవిశంకర్, శ్రీరామ్ పంచూలతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కక్షిదారులతో రహస్యంగా చర్చలు జరిపి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఐతే, కక్షిదారులు ఓ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో మధ్యవర్తిత్వం విఫలమైంది.

అయోధ్య కేసు- సుప్రీంకోర్టు రోజువారీ విచారణ:

మధ్యవర్తిత్వం విఫలం కావడంతో ఆగస్టు 6 నుంచి సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 14 పిటిషన్లపై విచారణ జరిపింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా వారంలో ఐదు రోజులు అయోధ్య కేసుపై వాదనలు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై కొంతమంది పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కోర్టు పట్టించుకోలేదు. రామ్‌లల్లా విరాజ్‌మాన్, నిర్మోహి అఖాడా, ఆలిం డియా రామ్‌ జన్మస్థాన్‌ పునరుత్థాన్‌ సమితి, 1951లో తొలి వ్యాజ్యం దాఖలు చేసిన గోపాల్‌ సింగ్‌ విశారద్‌ వారసుడితోపాటు షియా వక్ఫ్‌బోర్డు వాదనలను ముగించింది. ఇస్లామిక్‌ చట్టాల ప్రకారం బాబ్రీ మసీదును మసీదుగా పరిగణించలేమని సీనియర్‌ న్యాయవాది పీఎన్‌ మిశ్రా వాదించారు. వివాదాస్పద కట్టడాన్ని నిర్మించిన స్థలం బాబర్‌కు గానీ, మీర్‌ బకీకి గానీ చెందనది కాదని గుర్తు చేశారు. స్థల యజమాని వక్ఫ్‌ కార్య క్రమాల కోసం స్వచ్ఛందంగా ఇవ్వలేదని స్పష్టం చేశారు. అక్కడ రోజూ 2 సార్లు నమాజ్‌ నిర్వహించడం లేదని, కట్టడం లోపల గుడి గంటలు, విగ్రహాలు, జంతువుల చిత్రాలు ఉన్నాయని చెప్పారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్‌ ఫర్మానా ప్రకారం ఆలయం ఎప్పటికీ ఆలయమేనని, కూలగొట్టిన ఆలయంలో నిర్మించిన మసీదు సమ్మతించదగినది కాదని స్పష్టం చేశారు. వివాదాస్పద ప్రాంతంలో రామాలయ నిర్మాణంతో పాటు మసీదు నిర్మిస్తే తమకు అభ్యంతరం లేదని షియా వక్ఫ్ బోర్డు ప్రతిపాదించింది. సున్నీ వక్ఫ్ బోర్డు కూడా మొదట మసీదు నిర్మాణానికి పట్టుబట్టినప్పటికీ, చివరికి పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అక్టోబర్ 16తో అయోధ్య కేసులో విచారణ ముగిసింది. నవంబర్ 17లోపు సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వనుంది. మరి, సుప్రీంకోర్టు తీర్పుతో దశాబ్దాల వివాదానికి తెరపడుతుందా..? సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి ఉంటామంటున్న రాజకీయ పార్టీలు, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాయా..? అన్న‌ది వేచి చూడాల్సిందే.

  • రంజ‌న్ - సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్

Next Story