ఆ రోజు ధోనితో గొడ‌వ‌కు అదే కార‌ణం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2020 1:08 PM GMT
ఆ రోజు ధోనితో గొడ‌వ‌కు అదే కార‌ణం

పాకిస్థాన్ జ‌ట్టు 2005లో ఆరు వ‌న్డేల సిరీస్‌ను ఆడేందుకు భార‌త‌ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చింది. ఈ సిరీస్‌ను టీమిండియా 4-2తో కైవ‌సం చేసుకుంది. అయితే ఆ సిరీస్‌లోని ఓ మ్యాచ్‌లో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వికెట్ కీప‌ర్ ఎంఎస్ ధోనిపై అప్ప‌టి పేస‌ర్ ఆశిష్ నెహ్ర ఓ మ్యాచ్‌లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. తాజాగా ఆ ఘ‌ట‌న పై నెహ్రా స్పందించాడు.

ఆ వీడియో చూసిన చాలా మంది అది విశాఖ‌పట్నంలో జ‌రిగిన రెండో మ్యాచ్ అని అనుకుంటున్నార‌ని, కానీ ఆ వీడియో అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన నాలుగో వ‌న్డేకి సంబంధించిన‌ది అని గుర్తు చేశాడు. అస‌లేం జ‌రిగిందంటే.. ఆ బాల్‌కు ముందు షాహిద్ అఫ్రిదీ తన బౌలింగ్ లో సిక్సర్ బాద‌డ‌ని.. ఆ తర్వాత బంతికి ఆఫ్రిది క్యాచ్ ఇవ్వ‌గా.. అటు వికెట్ కీపర్ ధోనీ గాని, స్లిప్‌లో ఉన్న రాహుల్ ద్రావిడ్ గాని క్యాచ్ అందుకోలేక‌పోయార‌ని తెలిపాడు. ఈ క్రమంలో ధోనిపై తన అసహనాన్ని వ్యక్తం చేసినట్లు గుర్తు చేసుకున్నాడు. ఇలాంటి సమయంలో ఏ క్రికెటర్ అయినా కూడా అలానే ప్రవర్తిస్తాడ‌ని అన్నాడు. ఘ‌ట‌న జరిగిన తర్వాత ధోనీ, ద్రవిడ్ తనతో మామూలుగానే ఉన్నారని పేర్కొన్నాడు. అయితే అప్పటి తన ప్రవర్తన పై చింతించినట్లు తెలిపాడు.

ఇక భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా ధోని అయ్యాక‌.. అత‌డి సార‌థ్యంలో కూడా నెహ్రా ఆడాడు. 2011 వన్డే ప్రపంచక‌ప్‌ గెలుపొందిన భారత జట్టులో ఈ మాజీ పేస‌ర్ స‌భ్యుడే. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన తర్వాత నెహ్రా.. తిరిగి జాతీయ‌జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. 2017లో క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు.

Next Story