ఒక్క భార్యతోనే పరేషాన్‌.. ఇక రెండో భార్యనా..

By అంజి  Published on  18 Jan 2020 1:59 PM GMT
ఒక్క భార్యతోనే పరేషాన్‌.. ఇక రెండో భార్యనా..

కామారెడ్డి జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్నారు. మజ్లీస్‌ ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాదని.. రాష్ట్రమంతటా ఎంఐఎం విస్తరిస్తోందని అసదుద్దీన్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ఈ సభను ఏర్పాటు చేశారు. కాగా ఎంఐఎం పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించాలన్నారు.

తనకు ఇద్దరు భార్యలు ఉన్నారని ప్రచారం చేస్తున్నారని.. ఒక్క భార్యతోనే పరేషాన్‌ ఉంది.. రెండో భార్యను ఎలా చేసుకుంటానన్నారు. తనపై దుష్ప్రచారం చేసి అభాసుపాలు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. జార్ఖండ్‌లో ఎంఐఎం నిలబడితే.. బీజేపీ ఓడిపోయిందని తెలిపారు. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్‌ది పెళ్లి బంధమన్నారు. పెళ్లి వీళ్లు చేసుకుంటే.. రిసెప్షన్‌ మాత్రం శరద్‌ పవార్‌ చేసుకున్నారని అసదుద్దీన్‌ ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమం అనంతరం అసదుద్దీన్‌ ఓవైసీ నిజామాబాద్‌ బయల్దేరారు. రాత్రి 9 గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తిరిగి రేపు ఆర్మూర్‌ పట్టణంలో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అసదుద్దీన్‌ పాల్గొంటారని ఎంఐఎం నాయకులు తెలిపారు.

Next Story