బరితెగించిన ఆర్మీ జవాన్లు.. అయ్యప్ప భక్తులపై దాడి
By సుభాష్ Published on 5 Jan 2020 11:43 AM GMT- భక్తుడి మెడలో మాలను తెంచివేసిన జవాను
- భక్తులపై దురుసుగా వ్యవహరించిన ఆర్మీ జవాన్లు
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. తిరుపతిలో అర్థరాత్రి శబరి ఎక్స్ ప్రెస్ రైల్లో అయ్యప్పస్వాముల పట్ల ఆర్మీ జవాన్లు దురుసుగా ప్రవర్తించారు. జవాన్లు భక్తుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం ఇప్పుడు సంచలనంగా మారింది. మద్యం మత్తులో ఉన్న జవాన్లు అయ్యప్పమాల ధరించిన భక్తులపై దాడికి దిగారు. అయ్యప్ప భక్తుడి మెడలో ఉన్న మాలను తెంచివేశారు. కాగా, రైలు బోగిలోని టాయిలెట్ రూమ్లో మద్యబాటిళ్లు లభ్యమయ్యాయి. అయ్యప్ప భక్తులపై జవాన్లు దాడి చేయడంపై భక్తులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇద్దరు జవాన్లను అరెస్ట్ చేశారు. నిందితులు శ్రీకాకుళంకు చెందిన జవాన్లుగా గుర్తించారు రైల్వే పోలీసులు. రైల్లో వారు సేవించిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శబరిమల నుంచి హైదరాబాద్ వస్తున్న శబరి ఎక్స్ ప్రెస్ రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆర్మీ జవాన్ల తీరుపై నిరసనల వెల్లువ..
శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమైన అయ్యప్పస్వాములపై రైల్లో ఆర్మీ జవాన్లు దాడి చేయడం పట్ల అయ్యప్పస్వాములు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక పవిత్రమైన అయ్యప్ప స్వామి మాలలో ఉన్న భక్తులపై దాడి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. భక్తుడి మెడలో ఉన్న మాలను జవాను తెంచివేయడం దారుణమని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.