ఏపీలో అన్లాక్ 5.0 మార్గదర్శకాలు
By సుభాష్ Published on 9 Oct 2020 5:16 PM ISTఇటీవల కేంద్ర ప్రభుత్వం అన్లాక్5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో దాదాపు అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యధివిధిగా సాగుతున్నాయి. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వానికి సంబంధించి
అన్లాక్5.0మార్గదర్శకాలను విడుదల చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు, భౌతిక దూరం తప్పకుండా పాటించాలని పేర్కొంది. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రజారవాణాలో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ప్రార్థనా మందిరాల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవలని పేర్కొంది.
అలాగే మాస్క్ లేకుండా షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్లో ప్రవేశం ఉండదని, కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. బస్టాండు, రైల్వే స్టేషన్లలో మాస్కులు ధరించేలా ప్రచారం నిర్వహించాలని తెలిపింది.
కోవిడ్ నిబంధనలపై టెలీ ఫిల్మ్ ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. విద్యాసంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతంలో కేంద్ర మార్గదర్శకాలు తప్పకుండా పాటించాలని తెలిపింది. అలాగే విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి పీరియడ్ తర్వాత శానిటైజేషన్ చేసుకునేలా యాజమాన్యాలు ఆదేశాలు ఇవ్వాలని తెలిపింది.