గిరిజన సంక్షేమానికి పెద్ద పీట: సీఎం జగన్‌

By సుభాష్  Published on  2 Oct 2020 8:01 AM GMT
గిరిజన సంక్షేమానికి పెద్ద పీట: సీఎం జగన్‌

గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. శుక్రవారం ఆయన క్యాంప్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే పట్టాల పంపిణీతో పాటు మరికొన్ని గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు జగన్‌ శ్రీకారం చుట్టారు. అలాగే పాడేరులో మెడికల్‌ కాలేజీ, కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, గిరిజన ప్రాంతాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆన్‌లైన్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జగన్‌ మాట్లాడుతూ.. ఇంటింటికి ప్రభుత్వ పథకాలు, గ్రామ గ్రామానికి ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని అన్నారు. గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశామని, లక్షా 53 వేల మంది గిరిజనులకు 3.12 లక్షల ఎకరాల భూమి పంపిణీ, రైతు భరోసా సాయం అందిస్తున్నామని అన్నారు.

మన గ్రామాల్లో మన ఇంటి వద్దకే వచ్చిన మన తలుపు తట్టి ఏ సాయం కావాలన్న, లంచాలకు తావులేకుండా మనకు మంచి చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థలు స్థాపించి దాదాపు ఏడాది పూర్తవుతోందని, లాభాపేక్ష లేకుండా ఎన్నో సేవలు అందిస్తున్నారని అన్నారు.

అలాగే హాస్టళ్లలో మంచి వాతావరణం, నాణ్యమైన ఆహారం ఉండాలన్నారు. హాస్టళ్లలో నాడు-నేడు అమలు చేసిన పరిస్థితిని మార్చాలని అధికారులను సీఎం ఆదేశించారు. జగనన్న గోరుముద్ద మాదిరిగా మెనూ ఉండాలని సూచించారు. హాస్టల్‌ విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ఇస్తామని, పిల్లలకు ఏం ఇస్తే బాగుంటుంది..? ఏ విధంగా పౌష్టికాహారం ఇవ్వాలనే దానిపై ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో పూర్తి వసతులను నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా కల్పిస్తామని, హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు కూడా బెల్టులు, దుప్పట్లు, అల్మారాలు, మంచాలు ఇతర వసతులు ఉండాలన్నారు.

Next Story