జగన్ సర్కార్కు ఒకే రోజు మూడు ఎదురు దెబ్బలు
By సుభాష్ Published on 22 May 2020 6:11 PM ISTఏపీ ప్రభుత్వానికి ఒకే రోజు మూడు ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగుల జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కూడా ఎత్తివేసింది. అలాగే వెంకటేశ్వరరావుకు సంబంధించిన క్యాట్ ఇచ్చిన ఆదేశాలను కూడా కోర్టు పక్కనపెట్టేసింది.
ఇక విశాఖ జిల్లా నర్సీపట్నం వైద్యుడు సుధాకర్తో పోలీసులు వ్యవహరించిన తీరుపై సీబీఐ విచారణకు ఆదేశించింది. విశాఖపట్నంలో అరెస్టు అయిన వైద్యుడు సుధాకర్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై విశాఖ పోలీసులపై కేసు నమోదు చేయాలని సీబీఐకి సూచించింది. అంతేకాదు ఈ ఘటనపై 8వారాల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇక సుధాకర్ రెడ్డి శరీరంపై గాయాలున్న విషయం మేజిస్టేట్ నివేదికలో ఉందని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గాయాల విషయాన్ని ప్రస్తవన లేదని కోర్టు తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన నివేదికను నమ్మడం లేదన్న హైకోర్టు... దీని వెనుకు ఏదో కుట్ర ఉందని భావిస్తున్నామని కోర్టు వ్యాఖ్యనించింది. ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, అందుకే ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపింది. ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు వైద్యునిపై విధించిన సస్పెన్షన్ కాలానికి సంబంధించి కూడా వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది.
ప్రభుత్వ కార్యాలయాలకు రంగులపై..
అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడంపై సర్కార్ జారీ చేసిన జీవో నంబర్ 623ను హైకోర్టు రద్దు చేసింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు ఉన్న మూడు రంగులకు అదనంగా వేస్తున్న మరో రంగు పార్టీ రంగు కాదని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. సుప్రీం కోర్టు, హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించలేదని హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
కోర్టు ధిక్కరణ కింద సుమోటోగా కేసు
ఈ విషయంపై కోర్టు ధిక్కారం కింద సుమోటోగా కేసు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. అంతేకాదు సర్కార్, ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించి. మే 28వ తేదీన సుమోటో కేసుగా హైకోర్టు విచారణకు వచ్చే అవకాశం ఉంది.