‘లూలూ గ్రూప్’పై అంతా అసత్య ప్రచారమే :ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

By Newsmeter.Network  Published on  21 Nov 2019 12:36 PM GMT
‘లూలూ గ్రూప్’పై అంతా అసత్య ప్రచారమే :ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

అమరావతి: అవినీతిలేని పాలనే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. పారదర్శకత కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటామన్నారు. 'లూలూ 'గురించి పత్రికలలో కథనాలే తప్ప అధికారిక ప్రకటన లేదన్నారు. లూలూకు కేటాయించిన భూములలో న్యాయపరమైన ఇబ్బందలున్నాయని మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు. వాస్తవ భూమి ధరలకు, లూలూ చెల్లించే అద్దెకు పొంతన లేకే రద్దు చేసుకున్నామన్నారు.

గత ప్రభుత్వం హయాంలో ఫిబ్రవరి,2018 లో లూలూ ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఆ లూలూ ప్రాజెక్టుకు కేటాయించిన 13.83 ఎకరాల భూమి కేసుల్లో ఉందన్నారు. న్యాయపరమైన చిక్కులున్న భూమిని అప్పగించడంపై నాటి ఏపీఐఐసీ ఎండీ రాసిన లేఖను గురించి మంత్రి ప్రస్తావించారు. ముఖ్యమంత్రి మొదటి నుంచి చెబుతున్నట్లు పారదర్శక పాలనకే పెద్దపీట వేస్తున్నామన్నారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని ప్రచారాలు, కథనాలు రాసినా అబద్ధాలు నిజం కాబోవన్నారు మంత్రి గౌతమ్ రెడ్డి. తప్పును తప్పని చెప్పకుండా అదే తప్పుదారిలో వెళ్లడం సరైంది కాదన్నారు. అందుకే గత ప్రభుత్వంలోని ఇష్టారీతిన జరిగిన లోపాయికారి ఒప్పందాలను నేరుగా ప్రజల ముందుంచడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

లూలూ ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేయడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు. లూలూతో ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేసుకోవడానికి బిడ్డింగ్ లో పారదర్శకత లేకపోవడం మొదటి కారణమన్నారు. రెండోది.. లూలూకు కేటాయించిన భూమి చాలా విలువ ఉన్నా.. అది చాలా తక్కువ ధరకే అప్పగించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనన్నారు. లూలూకు కేటాయించిన భూమికి మార్కెట్ విలువ ప్రకారం ప్రస్తుత ధర ఎకరాకు సుమారు రూ. 40-42 కోట్ల వరకూ ఉంటుందన్నారు. అంత విలువైన భూమికి సరిగ్గా లెక్కేస్తే గత ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ఒక్కో చదరపు అడుగుకు రూ. 5 కూడా రాదని మంత్రి వ్యాఖ్యానించారు. తక్కువ ధరకే అద్దెకు ఇవ్వడం కారణంగా సుమారు రూ. 500 కోట్లపైనే ఏడాదికి ప్రజాధనం వృథా అవుతుందన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే ..తమ ప్రభుత్వం లూలూతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుందన్నారు.

వీరా వాహన ఉద్యోగ ప్రైవేట్ లిమిటెడ్’తో ఒప్పందం

రూ. 1000 కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ అయిన ‘వీరా వాహన ఉద్యోగ ప్రైవేట్ లిమిటెడ్’ అనంతపురంలో రాబోతుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఒప్పందం పూర్తయిందని మంత్రి తెలిపారు. 120 ఎకరాల్లో ఏర్పాటు కానున్న మానుఫాక్చరింగ్ యూనిట్ లో ఏడాదికి 3వేల ఎలక్ట్రిక్ బస్సులు తయారు కానున్నాయని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం కోల్పోని విధంగా చాలా తక్కువ మొత్తాన్ని ప్రోత్సహకాలుగా ఇవ్వనున్నామని మంత్రి తెలిపారు. విద్యుత్ రాయితీలు, నీటి సరఫరా వంటి మౌలిక వసతుల కల్పనలో కూడా పరిమితులకు లోబడి ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి మేకపాటి స్పష్టం చేశారు.

Next Story