విరుగుడు మంత్రం కనిపెట్టిన వైసీపీ సర్కార్‌..!

By సుభాష్  Published on  29 April 2020 12:49 AM GMT
విరుగుడు మంత్రం కనిపెట్టిన వైసీపీ సర్కార్‌..!

ఒక్క ఐడియానే జీవితాన్ని మార్చేస్తుందంటుంటారు. అలాంటి ఐడియాలు వచ్చేంది జగన్ సర్కార్‌కు. తనదైన శైలిలో దూసుకుపోతున్న జగన్.. కొత్త కొత్త ఐడియాలకు పదును పెట్టడంతో దిట్ట. మొదటిసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినా..పాలనా పరంగా దూసుకుపోతున్నారు జగన్. ఇక జగన్ సర్కార్‌కు తోడు పెద్దలు కూడా తమ మెదడుకు పదును పెడుతున్నారు. అందుకే తన ఆలోచనలతో విపక్షాలను చిత్తు చేస్తున్నారు.

పంచాయతీ భవనాలకు రంగులు వేసిన వైసీపీకి.. గత కొన్ని రోజుల కిందట హైకోర్టు మొట్టికాయ వేసిన విషయం తెలిసిందే. భవనాలకు వేసిన వైసీపీ రంగులు మార్చేయాలని సూచించింది కోర్టు. అంతేకాదు మూడు నెలల గడువు ఇచ్చి రంగుల మార్చాలని సూచించింది. ఇప్పుడు అన్ని భవనాలకు రంగులు మార్చాలంటే కోట్లల్లో ఖర్చు. తడిసి మోపెడవుతుంది. ముందే కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం వద్ద అంతాగా డబ్బులు లేని పరిస్థితి. ఇలాంటి కష్టకాలంలో రంగులు మార్చాలంటే ఇబ్బందికర విషయమే.

విరుగుడు మంత్రం కనిపెట్టిన వైసీపీ

కాగా, భవనాలకు వేసిన రంగులను మార్చాలని కోర్టు సూచించడంతో అందుకు వైసీపీ సర్కార్‌కు అదిరిపోయే ఐడియా వచ్చింది. మూడు రంగులకు తోడుగా మరో రంగుని కలిపేస్తే కొత్త రంగులు అయిపోతుందని భావిస్తోంది వైసీపీ సర్కార్. వైసీపీకి వచ్చిన ఆలోచనతో కోర్టు మాట విన్నట్టు ఉంటుంది.. ఇటు విపక్షాల విమర్శల నుంచి తప్పుకున్నట్లు ఉంటుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రభుత్వ భవనాలకు ఎలాంటి రంగులు ఉండాలని వైసీపీ సర్కార్ ఆలోచిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ఉన్నతాధికారులతో ఓ సబ్ కమిటీ కూడా వేసింది. ఆ కమిటీ జాతీయ ప్రభుత్వ భవనాల కోడ్‌ మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని పలు సూచనలు, సలహాలు చేసినట్లు తెలుస్తోంది. కమిటీ చెప్పినదాని ప్రకారమే ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు, వాటి ఉద్దేశాలను తెలుపాలని, అంతేకాకుండా ప్రకృతికి అద్దం పట్టాలని ప్రభుత్వం కమిటీకి సూచించినట్లు తెలుస్తోంది.

అందుకే ఇప్పుడు కొత్తగా మరో రంగును చేర్చుతున్నారు. కొత్తగా చేర్చే రంగు మట్టిరంగు. అది భూమికి, మట్టికి సంబంధించిన సూచికగా చెబుతున్నారు. దానిని పరిగణలోకి తీసుకునే ఈ రంగును చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఇక సబ్ కమిటీ సూచించిన రంగులలో ఆకు పచ్చ వ్యవసాయ విప్లవానికి, నీలి రంగు ఆక్వా విప్లవానికి, తెలుపు రంగు క్షీర విప్లవానికి గుర్తుగా భావిస్తున్నారట. రేపటి రోజున ఎవరు కూడా ప్రశ్నించడానికి వీలుండదు. ఇలా సబ్ కమిటీ సిఫార్సులు, జాతీయ ప్రభుత్వ భవనాల మార్గదర్శకాలను జోడించి రంగుల గురించి ఆలోచించింది వైసీపీ.

తగ్గనున్న ఖర్చు

కాగా, ప్రస్తుతం భవనాలకు వేసిన వైసీపీ రంగులకు దాదాపు 1500 కోట్లు ఖర్చయింది. ఇప్పుడు రంగులు మార్చాలన్నా ఖర్చు తడిసిమోపెడవుతుంది. మళ్లీ రంగులు మార్చాలంటే 1500 కోట్లు కావాల్సిందే. అన్నింటికీ ఉన్న రంగులకు కొత్తగా ఒక రంగు చేర్చితే తక్కువ ఖర్చుతోనే పని పూర్తవుతుంది. అంతేకాదు కోర్టు మాట కూడా విన్నట్టు ఉంటుంది. మరి వైసీపీ వేసే ప్లాన్‌ ఎంత వరకూ సక్సెస్‌ అవుతుందో చూడాలి.

Next Story