లోకల్ ఎలక్షన్ వార్.. వెనక్కు తగ్గని జగన్ సర్కార్..
By అంజి
అమరావతి: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా పడడం రాజకీయ రగడకు దారి తీసింది. స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ఈసీ రమేష్ కుమార్ నిర్ణయం వల్ల రాష్ట్రానికి నష్టం చేకూరుతోందని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. కాగా రూ.5 వేల కోట్లు స్థానిక సంస్థలకు ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంపై హెల్త్ సెక్రటరీ, సీఎస్లతో చర్చించకుండా నిర్ణయం తీసుకోవడంపై జగన్ ప్రభుత్వం ఆగ్రహంతో ఉందని తెలుస్తోంది. వైరస్ వ్యాప్తి అంటూ ఈసీ ఏకపక్ష నిర్ణయంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేయనుంది. ఈ నెలఖారులోపు ఎన్నికలను నిర్వహిస్తే.. రాష్ట్రంలో పాలన మరింత బలపడుతుందన్న అంశాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందుంచనుంది.
Also Read: గవర్నర్ను కలవనున్న ఈసీ.. ఏం నిర్ణయం తీసుకుంటారో !
ఇదిలా ఉంటే.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికలను యథాతథంగా కొనసాగించాలని తన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ఆరు వారాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని నీలం సాహ్ని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అసరమైన సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓట్ల జాబితాలు ముద్రణ పూర్తైందని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో సీఎస్ తెలిపారు. ప్రజారోగ్యం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది అని అన్నారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపుంటే కరోనాపై వాస్తవ నివేదికను అందించేవాళ్లమన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా పూర్తి నియంత్రణకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
Also Read: జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఐవైఆర్.. ఈసీకి ఆ హక్కుంది..!
మరోవైపు గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ను సీఈసీ రమేష్ కుమార్ కలిశారు. రాజ్భవన్లో కలిసిన ఆయన.. స్థానిన ఎన్నికల వాయిదాకు గల కారణాలను వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో పాటు ఐజీ సత్యనారాయణ గవర్నర్ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.