12 వేల లోపు ఆదాయం ఉన్నవారికి వైఎస్సార్‌ పెన్షన్‌: కేబినెట్‌లో కీలక నిర్ణయం

By సుభాష్  Published on  11 Dec 2019 3:15 PM GMT
12 వేల లోపు ఆదాయం ఉన్నవారికి వైఎస్సార్‌ పెన్షన్‌: కేబినెట్‌లో కీలక నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఈ రోజు కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెల ఆదాయం రూ.10 వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేల లోపు ఆదాయం ఉన్నవారికి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక వర్తించేలా నిర్ణయం తీసుకుంది. గతంలో కంటే నెలవారీ ఆదాయపరిమితి పెంపు, మూడు ఎకరాల పల్లం లేదా, 10 ఎకరాల్లోపు మెట్ట లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉన్నవారికి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక వర్తించనుంది. సొంతంగా కారు ఉన్నవారు అనర్హులు. ట్యాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు ఉన్నవారికి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అలాగే సీఆర్డీఏ పరిధిలోని రాజధాని అసైన్డ్‌ భూములకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసి ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చిన అసైన్డ్‌కు ఇచ్చిన అసైన్డ్‌ భూములకు రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ ప్లాట్ల కేటాయింపు రద్దుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

మరో చరిత్రాత్మక బిల్లుకు ఆమోదం:

మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని మరో చరిత్రాత్మక బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం చిన్నారులకు అండగా నిలిచింది. ఇటీవల ‘దిశ’ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ దిశ యాక్ట్‌ పేరుతో కొత్త చట్టం తీసుకువచ్చింది. ఏపీ దిశ యాక్ట్‌గా ఈ చట్టానికి నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 354కు సవరణలు చేసి కొత్తగా 354-ఈ చేర్చింది. ఈ చట్టం ద్వారా అత్యాచారానికి పాల్పడిన ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెలువడనుంది. వారం రోజుల్లోగా విచారణ పూర్తిచేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి రెండు వారాల్లోగా ట్రయల్ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చేయడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. అత్యాచారాలకు పాల్పడినట్లు ఖచ్చితమైన ఆధారాలుంటే నిందితులకు మూడు వారాల్లోగా ఉరిశిక్ష విధించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు రూపొందింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు తదితర నేరాలకు సత్వరమే విచారణ చేసేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అలాగే గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాలపై సమీక్ష, పర్యవేక్షకులకు బలోపేమైన యంత్రాగం ఏర్పాటు చేయడానికి కొత్త శాఖ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వంలో ఏపీఎస్‌ ఆర్టీసీ విలీనం కొరకు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటుకు అనుమతి లభించింది. ఏపీఎస్‌ ఆర్టీసీలో వివిధ కేటగిరీల్లో ఉన్న 51,488 మంది ఉద్యోగుల సంఖ్యకు తగినట్టుగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో పోస్టుల ఏర్పాటుకు కేబినెట్‌ అంగీకరించింది.

అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరి చేస్తూ...

అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిచేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లిషు మాధ్యమంలో బోధన నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది..తదుపరి సంవత్సరాల్లో ఒక్కో ఏడాది ఒక్కో తరగతి చొప్పున ఇంగ్లిషు మాధ్యమంలో బోధన తప్పనిసరి చేస్తూనిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రివర్గం పేర్కొంది

వేతనాల పెంపు:

అలాగే వీఓఏ, సంఘమిత్ర, యానిమేటర్ల జీతాల పెంపుదలకు మంత్రివర్గం అంగీకారం. వారికి రూ.10వేల చొప్పున జీతాలు పెంచుతూ ఇటీవలే నిర్ణయం. తాజా నిర్ణయంతో 27,797 మందికి లబ్ధి. ఆంధ్రప్రదేశ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ (ఏపీసీఎస్‌) చట్టం 1964లో సెక్షన్‌ 21–ఎ (1) (ఇ) సవరణకు ఆమోదం. చిత్తూరుజిల్లా ఏర్పేడు మండలం పంగూరు గ్రామంలో 15 ఎకరాల 28 సెంట్ల భూమి ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీకి కేటాయింపునకు అంగీకారం.

అలాగే ఏపీలో వీఓఏ, సంఘమిత్ర, యానిమేటర్‌ల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. వారికి రూ. 10వేల చొప్పున వేతనాలు పెంతుతూ ఇటీవల నిర్ణయం తీసుకోగా, తాజా నిర్ణయంతో 27,797 మందికి లబ్ది చేకూరుంది.ఏపీ కో ఆపరేటివ్‌ సొసైటీ చట్టం 1964లో సెక్షన్‌ 21ఏ (1) (ఈ) సవరణకు ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లాలోని పంగూరు గ్రామంలో 15.28 ఎకరాల భూమి ఇండస్ట్రీయల్‌ పార్కు ఏర్పాటుకు ఏపీ ఐఐసీకి కేటాయింపునకు అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్‌.

Next Story