కోహ్లీ లైవ్చాట్ను అడ్డుకున్న అనుష్క.. దానికి టైం అయ్యిందంటూ..
By తోట వంశీ కుమార్ Published on 3 April 2020 8:14 AM GMTకరోనా వైరస్ ముప్పుతో పలు క్రీడా టోర్నీలు రద్దు కాగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. ఈ మహమ్మారి కట్టడి చేసేందుకు చాలా దేశాలు లాక్డౌన్ను ప్రకటించాయి. దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్డౌన్తో ఇంటికే పరిమితమైన విరాట్కోహ్లీ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటున్నాడు. ప్రమాదకర వైరస్పై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు.
తాజాగా గురువారం రాత్రి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్తో ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్లో పాల్గొన్నాడు. అనేక విషయాలను ఇద్దరు చర్చించుకున్నారు. వీరిమధ్య సంభాఫణ చాలాసేపు కొనసాగింది. వీరిద్దరి మధ్య లైవ్చాట్ సీరియస్గా జరుగుతున్న సమయంలో కోహ్లీ భార్య, బాలీవుడ్ భామ అనుష్క శర్మ ఎంట్రీ ఇచ్చి ఫన్నీగా మార్చేసింది.
అనుష్క శర్మతో కలిసి తాను ఎప్పుడూ ఇన్నిరోజుల సమయం గడపలేదని కోహ్లీ ఎమోషనల్గా చెప్తుండగా.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన అనుష్క శర్మ 'చలో చలో డిన్నర్ టైమ్' అని నవ్వుతున్న ఎమోజీని జతచేసి లైవ్చాట్లో కామెంట్ పెట్టింది. దాన్ని స్క్రీన్షాట్ తీసిన పీటర్సన్ అభిమానులతో పంచుకున్నాడు. అనుష్కను కోహ్లీ బాస్గా పీటర్సన్ అభివర్ణించాడు. అనంతరం అనుష్క నిద్రపోయేముందు కోహ్లీతో సరదాగా ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్తో తీసుకున్న ఫొటోలను స్టోరీస్లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.
పీటర్సన్తో కోహ్లీ మాట్లాడేటప్పుడు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) ఒక్కసారి కూడా విజేతగా నిలవకపోవడంపై విరాట్ కోహ్లీ స్పందించాడు. తమ జట్టు మూడు సార్లు పైనల్ చేరినా కప్పు గెలవలేకపోయిందని, ఆర్సీబీ కచ్చితంగా కప్పు సాధించడానికి అర్హమైన జట్టు అని కోహ్లీ అన్నాడు.