ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 'జగన్': వైసీపీ
By Newsmeter.Network
ముఖ్యాంశాలు
- నవరత్నాలు, ఇతర వాగ్దానాల అమల్లో శర వేగం
- ప్రజల సమస్యలే ధ్యేయం
- జగన్ ఆరు నెలల పాలనపై వైసీపీ ప్రకటన విడుదల
మేనిఫెస్టో అమలు అంశాన్ని ఎన్నికల అజెండాగా మార్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంలా భావిస్తానని ఎన్నికల ముందే చెప్పిన విషయం తెలిసిందే. మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావిస్తానని, చేసిన వాగ్దానాలను తప్పక అమలు చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఎన్నికల ప్రణాళిక అమలు, ఆదిశగా చర్యలు చేపట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో అమలు చేస్తూ పాలన కొనసాగిస్తున్నారు జగన్. వాగ్దానాల అమల్లో ప్రమాణాలు, విశ్వసనీయతను నిలబెట్టుకుంటున్నట్లు వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా జగన్ ఆరు నెలల పాలనపై వైసీపీ ఒక ప్రకటన విడుదల చేసింది వైసీపీ. అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే 82 శాతం హామీలు అమలు, అమలుదిశగా చర్యలు చేపట్టినట్లు పేర్కొంటున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు తాయిలాలు, మోసపుచ్చే వాటికి విభిన్నంగా పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించి తన కార్యాలయానికి వచ్చిన రోజునే తన కుర్చీకి ఎదురుగా మేనిఫెస్టో ప్రతిని బోర్డు రూపంలో పెట్టించాడని వైసీపీ పేర్కొంది. ప్రతిరోజూ తానిచ్చిన వాగ్దానాలు తనకు కనిపించాలంటూ సిబ్బందితో జగన్ చెప్పాడని ప్రకటనలో పేర్కొన్నారు. నవరత్నాలు సహా, మేనిఫెస్టోలో అమలు చేయదగ్గ కార్యక్రమాలకు సంబంధించి చురుగ్గా ఉత్తర్వులు , వాటి అమలుకు క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు, తీసుకున్న చర్యల వేగం, సరైన దిశగా అడుగులేస్తున్నారా? లేదా? అన్నదానిపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాల అమలు, పర్యవేక్షణకు రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేశారని, ఇందులో చైర్మన్గా ముఖ్యమంత్రి జగన్, సలహాదారు శామ్యూల్, మరో 12 మంది కీలక మంత్రులతో కమిటీ ఏర్పడినట్లు చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గృహనిర్మాణం, సంక్షేమ రంగాలకు సంబంధించి ఇచ్చిన హామీలు అమలుపై ప్రత్యేక సీఎం దృష్టి సారిస్తున్నారని ప్రకటనలో తెలిపారు.