అమరావతి: రాష్ట్రంలో తమ డిమాండ్ల సాధన కోసం నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలను అర్ధరాత్రి పూట పోలీసులు అరెస్టు చేయడంపై వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేసే హక్కును కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని ఆమె విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన షర్మిల, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై పలు ప్రశ్నలు సంధించారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న మహిళలని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు అనేక వాగ్దానాలు చేసిన కూటమి నేతలు, ఇప్పుడు ఆ హామీల గురించి అడిగితే జైలుకు పంపడమేనా మీ చిత్తశుద్ధి? అని నిలదీశారు. 2023 డిసెంబర్లో అంగన్వాడీలు 42 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు, అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని పేర్కొన్న షర్మిల, కాంగ్రెస్ పార్టీ తరపున అంగన్వాడీలకు నెలకు రూ. 26 వేల కనీస వేతనం చెల్లించాలి, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యూటీ అమలుకు తక్షణమే మార్గదర్శకాలు విడుదల చేయాలి, వేతనంతో కూడిన మెడికల్ లీవులను అంగన్వాడీలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 1810 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న అంగన్వాడీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.