రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు: వైఎస్ జగన్
అమరావతి రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By - అంజి |
రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు: వైఎస్ జగన్
అమరావతి రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీలో అమరావతిపై జరిగిన తీర్మానాన్ని ఒక 'డ్రామా'గా అభివర్ణించారు. రాజ్యాంగంలో రాష్ట్రాలకు సంబంధించి రాజధాని అనే పదం ఎక్కడా లేదని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టమంటూ ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. తనకు ఎలాంటి పాత్రా లేదంది. తన దోపిడీ నుంచి ప్రజలను పక్కదోవ పట్టిస్తూ చంద్రబాబు అమరావతి బిల్లు డ్రామా ఆడుతున్నారు. అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని మంత్రే అన్నారు' అని సమావేశంలో పేర్కొన్నారు.
రాజ్యాంగంలో ఎక్కడా 'రాజధాని' అనే పదమే లేదని, చంద్రబాబు నాయుడు కేవలం దోపిడీ, అవినీతి కోసమే అమరావతిని వాడుకుంటున్నారని ఆరోపించారు. ఏడేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా అమరావతిలో బాబు చేసిందేమీ లేదని, భూములిచ్చిన రైతులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని విమర్శించారు. అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్ కీలక గణాంకాలను ప్రస్తావించారు. చంద్రబాబు లెక్కల ప్రకారమే రోడ్లు, డ్రైనేజీల వంటి మౌలిక సదుపాయాలకే ఎకరానికి రూ. 2 కోట్లు ఖర్చవుతుందని, ఆ లెక్కన లక్ష ఎకరాలకు రూ. 2 లక్షల కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు.
ఇంత భారీ మొత్తాన్ని ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. గతంలో వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పి, ఇప్పుడు కేవలం ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుందని అనడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీశారు. అమరావతి పేరుతో పట్టపగలే దోపిడీ జరుగుతోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూనే, శాసనమండలిలో చర్చ జరపకుండా ప్రభుత్వం భయపడుతోందని జగన్ విమర్శించారు. కౌన్సిల్ సభ్యులు ప్రభుత్వ అవినీతిని బయటపెడతారనే భయంతోనే అక్కడ చర్చకు రావడం లేదని ఆరోపించారు. చట్టసభలకు చట్టాలు చేసే అధికారం ఉన్నట్లే, వాటిని సవరించే అధికారం కూడా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.