రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యం: వైఎస్ జగన్
పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం అయ్యారు
By - Srikanth Gundamalla |
పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యమని చెప్పారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడాలని స్థానిక ప్రజా ప్రతినిధులకు జగన్ పిలుపునిచ్చారు. అప్పుడే ప్రజల ఆశీస్సులు మనకు ఉంటాయని అన్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్లో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉందని ఆరోపణలు చేశారు.
రాజకీయాల్లో ప్రతి నాయకుడపై నమ్మకం ఉండాలని చెప్పారు వైఎస్ జగన్. విశ్వసనీయత చాలా ముఖ్యమని అన్నారు. వైఎస్సార్సీపీ ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చిన ప్రతిహామీను నెరవేర్చిందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ చెప్పారు. కారణాలేమీ చెప్పకుండా మేనిఫెస్టోను అమలు చేశామని అన్నారు. కోవిడ్ లాంటి సంక్షోభాన్ని రెండేళ్లపాటు ఎదుర్కొన్నామని వెల్లడించారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గాయని, ఖర్చులు పెరిగాయని వైఎస్ జగన్ చెప్పారు. ఇలాంటి పరిస్థితులు ఏపీలో వచ్చినా ఎక్కడా వెనకడుగు వేయకుండా ప్రజలకు ప్రతీ సంక్షేమ పథకాన్ని అందించామని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా బడ్జెట్కు ముందే సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశామని వైఎస్ జగన్ తెలిపారు. అలాంటి పాలనను రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఇంకా ఓటాన్ అక్కౌంట్తో నడుస్తోందని జగన్ విమర్శించారు.