బస్సు డ్రైవర్‌గా మారిన వైసీపీ ఎమ్మెల్యే..!

ఏలూరు సిద్ధం సభకు జనాల్ని తీసుకెళ్లే బాధ్యతను మాజీ మంత్రి పేర్ని నాని తీసుకున్నారు.

By Medi Samrat
Published on : 3 Feb 2024 5:00 PM IST

బస్సు డ్రైవర్‌గా మారిన వైసీపీ ఎమ్మెల్యే..!

ఏలూరు సిద్ధం సభకు జనాల్ని తీసుకెళ్లే బాధ్యతను మాజీ మంత్రి పేర్ని నాని తీసుకున్నారు. స్వయంగా ఆయనే బస్సు నడపడం విశేషం. నేడు ఏలూరు-దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్ లో సీఎం జగన్ సిద్ధం సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఆ సభ కోసం మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని బస్సు డ్రైవర్ గా మారారు. ఆయన మచిలీపట్నం నుంచి వైసీపీ కార్యకర్తలతో కూడిన బస్సును స్వయంగా నడుపుతూ ఏలూరు తీసుకెళ్లారు. ఈ బస్సులో పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు (పేర్ని కృష్ణమూర్తి) కూడా ఉన్నారు. పేర్ని కిట్టుకు మచిలీపట్నం వైసీపీ టికెట్ ఇచ్చింది. పేర్ని నాని గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన నేషనల్ హైవేపై ఎలాంటి తడబాటు లేకుండా సాఫీగా బస్సు నడిపారు. వైసీపీ లోగో ఉన్న టీషర్టు, వైసీపీ రంగులున్న టోపీ ధరించిన పేర్ని నాని రోడ్డుపై వెళ్లే ఇతర వాహనాల్లోని వారికి అభివాదం చేస్తూ ఉత్సాహంగా కనిపించారు.

దెందులూరులో జరిగే సిద్ధం సభకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల నుండి 100 బస్సుల్లో ప్రజలు చేరుకున్నారు. రాజానగరం నియోజకవర్గ నుండి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో 92 బస్సుల్లో వేలాదిగా సిద్ధం సభకు తరలి వచ్చారు అభిమానులు.

Next Story