'నందమూరి వంశ ప్రతాపాన్ని చూపండి'.. బాలయ్యకు మంత్రి అంబటి సలహా

సభలో చంద్రబాబు అరెస్టుపై టీడీపీకి కావాల్సింది చర్చ కాదు.. రచ్చ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

By అంజి  Published on  22 Sep 2023 5:12 AM GMT
YCP, Minister Ambati Rambabu, TDP, Balakrishna

'నందమూరి వంశ ప్రతాపాన్ని చూపండి'.. బాలయ్యకు మంత్రి అంబటి సలహా

అమరావతి: సభలో చంద్రబాబు అరెస్టుపై టీడీపీకి కావాల్సింది చర్చ కాదు.. రచ్చ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అరెస్ట్, అవినీతిపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ రోజు సభలో చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి అంబటి తెలిపారు. అయితే దీనికి టీడీపీ వారు మాత్రం సిద్ధంగా లేరని.. నిజంగా చర్చకు చిత్తశుద్ధి ఉంటే రావాలని అన్నారు. మీకు (టీడీపీ సభ్యులకు) నమ్మకం ఉంటే చంద్రబాబు నీతిమంతుడు, నిప్పు అనే విశ్వాసం ఉంటే చర్చలో పాల్గొనాలని, పారిపోవద్దని అన్నారు. మీసాలు తిప్పడం వల్ల ఏం ఉపయోగం లేదని, ముందుగా బాలకృష్ణ మీసాలు టీడీపీలో తిప్పాలని మంత్రి అంబటి హితవు పలికారు.

ఇప్పటికైనా నందమూరి తారకరామారావు వెన్నులో దించిన కత్తి తీసుకుని బయటకు రావాలన్నారు. ఇది బాలకృష్ణకు ఒక మంచి అవకాశమని, సీనియర్‌ ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీని బతికించుకునేందుకు ఇదొక మంచి ఛాన్స్‌ అని అన్నారు. జన్మనిచ్చిన తండ్రికి క్లిష్ట సమయంలో బాలకృష్ణ సహాయం చేయలేదనే అపవాదు ఉందని, ఆ అపవాదును తుడిచివేసే మహత్తర అవకాశం బాలకృష్ణకు వచ్చిందని అంబటి అన్నారు. ఇప్పుడు చంద్రబాబు జైల్లో ఉన్నారు.. నారా లోకేష్‌ ఢిల్లీలో ఉన్నాడు.. ఎందుకు ఉన్నాడో తెలియదన్నారు. ఈ అవకాశం మళ్లీ రాదని.. నందమూరి వంశ ప్రతాపాన్ని చూపండి అని అన్నారు.

''ఈ అవకాశంతో పోయిన పార్టీ పగ్గాలు మళ్లీ తీసుకోండి. నందమూరి వంశం ప్రతాపాన్ని చూపించండి. మీ పార్టీని బతికించుకోండి. అలా బతికించుకోడానికి ఇదొక చక్కని అవకాశం. మీ నాన్న పెట్టిన పార్టీని బతికించుకునే చక్కని అవకాశం, మీపై పడిన మచ్చను మాపుకునే అవకాశం. మీరు సమర్ధులే.. అయితే ఆ పని చేయండి. మీరు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మీకు నాయకత్వ లక్షణాలున్నాయి...అలా అని శాసన సభలో కాదు మీసం తిప్పాల్సింది..మీ పార్టీలో తిప్పండి. మా వ్యతిరేక పార్టీ అయినా సరే ఒక సూచన, సలహా ఇస్తున్నా'' అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

నిన్న స్పీకర్‌పై దాడికి ప్రయత్నించారు:

''నిన్న శాసనసభలో బాలకృష్ణ గారికి మొదటి హెచ్చరిక జారీ చేశారు..తప్పు చేస్తే రెండో హెచ్చరిక ఉంటుంది. చంద్రబాబును అరెస్ట్‌ చేశారు కాబట్టి ఏదో ఒక గొడవ చేయాలని వస్తున్నారు. పేపర్లు చించేసి, పోడియంపై ఉన్న మానిటర్‌ను పీకేశారు...స్పీకర్‌పై దాడి చేయాలనే పథకంతో వచ్చారు. ఒకవేళ అరెస్ట్‌ అయితే.. ఆ తర్వాత స్పీకర్‌పై దాడి చేసిన తెలుగుదేశం అని ఎల్లో మీడియాలో బ్యానర్ వార్తల కోసం వారు తాపత్రయ పడ్డారు. చర్చకు మేం అంగీకరించిన తర్వాత ఎందుకు గొడవ అనేది ప్రజలు కూడా ఆలోచించాలి'' అని మంత్రి అంబటి అన్నారు.

Next Story