విశాఖపట్నంలో ఒక వింత దొంగతనం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా నగలు, నగదు దొంగతనాలు చూస్తుంటాం కానీ, ఇక్కడ ఏకంగా గ్యాస్ సిలిండర్లతో ఒక డెలివరీ బాయ్ పరారయ్యాడు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్కు డిమాండ్ పెరిగిన తరుణంలో ఈ ఘటన జరగడం గమనార్హం. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని చినగంట్యాడలో ఉన్న మణికంఠ గ్యాస్ ఏజెన్సీలో వై.అప్పారావు అనే వ్యక్తి గత రెండేళ్లుగా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. వినియోగదారులతో ఉన్న పరిచయాలను ఆసరాగా చేసుకుని, వారి నుంచి ఓటీపీలు (OTPs) సేకరించి మోసానికి పాల్పడ్డాడు.
సిలిండర్లు బుక్ చేసినా డెలివరీ కాకపోవడంతో అనుమానం వచ్చిన వినియోగదారులు ఏజెన్సీని సంప్రదించారు. అయితే రికార్డుల్లో మాత్రం సిలిండర్లు డెలివరీ అయినట్లు ఉండటంతో బాధితులు అవాక్కయ్యారు. అప్పటికే అప్పారావు తన సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు. సుమారు 30 గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించడంతో పాటు, రూ. 13 వేల నగదును ఏజెన్సీకి చెల్లించకుండా అతను పారిపోయినట్లు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గాజువాక సీఐ అళహరి పార్థసారథి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.