తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 3వ తేదీన సంభవించనున్న చంద్రగ్రహణం కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దర్శన వేళల్లో మరియు టోకెన్ల జారీలో కీలక మార్పులు చేసింది. ఈ నెల 2, 3వ తేదీలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. గ్రహణానికి ముందు రోజైన 1వ తేదీన, 2వ తేదీన తిరుపతిలోని కౌంటర్లలో ఎలాంటి టోకెన్లు జారీ చేయరు.
4వ తేదీన స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం, 3వ తేదీ నుంచి తిరిగి టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 3వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల 2వ తేదీన ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు. గ్రహణ సమయంలో ఆలయ శుద్ధి, ఇతర కైంకర్యాల వల్ల దర్శన సమయాల్లో మార్పులు ఉంటాయని, భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ కోరింది.