రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 10 మంది మృతి చెందిన ఘటనపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సంచలన విషయాలను వెల్లడించారు. పాలల్లో అత్యంత విషపూరితమైన 'ఇథిలీన్ గ్లైకాల్' కలవడమే ఈ మరణాలకు కారణమని ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. సాధారణంగా పాల శీతలీకరణ యంత్రాల్లో గడ్డకట్టకుండా ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ఈ రసాయనాన్ని కూలెంట్గా ఉపయోగిస్తారు. అయితే, నిందితుడైన పాలు విక్రయించే అడ్డాల గణేశ్వరరావు ఫ్రీజర్ నుండి ఈ కెమికల్ లీకై, పాలు ఉన్న కంటైనర్లోకి చేరడంతో పాలు విషతుల్యమయ్యాయి.
ఫిబ్రవరి 15, 16 తేదీల్లో ఈ కల్తీ పాలు తాగిన 110 మందిలో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురవగా, అందులో 10 మంది 'అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్' (కిడ్నీలు దెబ్బతినడం) కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పసికందులు కూడా ఉండటం గమనార్హం. బాధితుల రక్త నమూనాలు, పాల శాంపిల్స్ పరీక్షించిన విజయవాడ రీజినల్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ విషయాన్ని ధృవీకరించింది. నిందితుడిపై హత్య మరియు హత్యానేరం కింద (BNS సెక్షన్లు 103, 105) కేసులు నమోదు చేసిన పోలీసులు, ప్రస్తుతం అతడిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు రిమాండ్కు తరలించారు.