Andhra Pradesh: పండుగ వేళ విషాదం.. నీటి కుంటలో మునిగి ముగ్గురు బాలురు మృతి
కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో హోలీ పండుగ వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రంగులు చల్లుకుని సరదాగా గడిపిన ముగ్గురు...
By - అంజి |
Andhra Pradesh: పండుగ వేళ విషాదం.. నీటి కుంటలో మునిగి ముగ్గురు బాలురు మృతి
కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో హోలీ పండుగ వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రంగులు చల్లుకుని సరదాగా గడిపిన ముగ్గురు బాలురు, స్నానం కోసం చెరువులోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చిక్కవరం కండ్రిక గ్రామంలో మంగళవారం (మార్చి 3) సాయంత్రం జరిగింది. చిక్కవరం కండ్రిక గ్రామానికి చెందిన డి. నవీన్ కుమార్, వెంకట జోసెఫ్, సాయి అనే ముగ్గురు స్నేహితులు (వీరి వయస్సు 12 నుండి 16 ఏళ్ల మధ్య ఉంటుంది) మంగళవారం ఉదయం స్నేహితులతో కలిసి ఉత్సాహంగా హోలీ ఆడారు.
ఒంటికి అంటుకున్న రంగులను కడుక్కునేందుకు సాయంత్రం సమయంలో గ్రామ సమీపంలోని ఒక నీటి కుంట వద్దకు వెళ్లారు. సాయంత్రం 6 గంటలు దాటినా పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామం మొత్తం వెతికారు. కొందరు స్థానికులు ఆ ముగ్గురు బాలురు నీటి కుంట వైపు వెళ్లడం చూశామని చెప్పడంతో, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడ గాలింపు చేపట్టి, చివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు.
పోలీసుల విశ్లేషణ ప్రకారం.. నీటి కుంట లోతుగా ఉండటంతో, స్నానం చేస్తున్న సమయంలో ఒక బాలుడు ప్రమాదవశాత్తూ కాలుజారి లోపలికి పడిపోయి ఉంటాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో మిగిలిన ఇద్దరు కూడా నీటిలో మునిగిపోయి ఉంటారని సిఐ శివప్రసాద్ తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు పండుగ రోజే మరణించడంతో చిక్కవరం కండ్రిక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ పిల్లలు ఇక లేరని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.