థాయ్‌లాండ్ నుంచి వచ్చి..రూ.3లక్షలకు పందెం కోడి కొనుగోలు

థాయ్‌లాండ్‌ నుంచి పందెంలో గెలిచిన కోడిని కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు.

By Srikanth Gundamalla  Published on  29 July 2023 2:23 AM GMT
Thailand, Youngsters, bought Cock , Rs.3 lakh,

థాయ్‌లాండ్ నుంచి వచ్చి..రూ.3లక్షలకు పందెం కోడి కొనుగోలు

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి వచ్చిందంటే కోళ్ల పందాలు జోరుగా సాగుతాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి కోళ్ల పందాల్లో పాల్గొంటారు. కొందరైతే కేవలం చూడటానికే వెళ్తుంటారు. లక్షల్లో పందాలు కొనసాగుతాయి. గెలిచిన వాళ్లు.. ఓడిన వారు అని తేడా లేకుండా తెగ ఎంజాయ్‌ చేస్తారు. అయితే.. కోడి పందాల గురించి థాయ్‌లాండ్‌ వారికి కూడా తెలిసింది. దాంతో.. పందెంలో గెలిచిన కోడిని కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు.

సోషల్‌ మీడియాలో కోళ్ల పందాలకు సంబంధించిన వీడియోలు చూసి.. పందెం కోడిని కొనేందుకు థాయ్‌లాండ్‌కు చెందిన కొందరు భారత్‌కు వచ్చారు. ఏలూరు జిల్లాలోని లింగపాలెం మండలం రంగాపురానికి చేరుకున్నారు. అక్కడ గ్రామంలో నాటు కోళ్ల ఫారం నిర్వహిస్తున్న కూరాకుల రత్తయ్యను కలిశారు. ఇటీవల భోగిపండుగ రోజున రత్తయ్య తన పుంజుతో పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో రూ.27లక్షల కోడి పందెం వేయగా.. అది గెలిచింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ గెలిచిన కోడినే కొనేందుక థాయ్‌లాండ్ నుంచి నలుగురు యువతీయువకులు వచ్చారు. అయితే.. పందెంలో గెలిచిన కోడిని విక్రయించేందుకు రత్తయ్య నిరాకరించాడు. చేసేందేం లేక థాయ్‌లాండ్‌కు చెందిన యువతీ యువకులు మరో కోడిని కొన్నారు. అయితే.. మరో పుంజుని కూడా అధిక ధరకే కొనుగోలు చేశారు. రూ.3లక్షలకు కొన్నారు. ఇక పందెంలో గెలిచిన కోడితో మాత్రం ఒక ఫోటో దిగారు. కోళ్ల పందాలు.. గెలిచిన కోళ్ల కోసం థాయ్‌లాండ్‌ నుంచి వచ్చారని తెలియడంతో స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Next Story