ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు టీడీపీ షోకాజ్ నోటీసు
డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్పై తెలుగుదేశం పార్టీ...
By - అంజి |
ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు టీడీపీ షోకాజ్ నోటీసు
డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్పై తెలుగుదేశం పార్టీ (TDP) క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఈ వివాదంపై వివరణ కోరుతూ పార్టీ అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై ఐదు రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మీడియాలో వస్తున్న కథనాలను తీవ్రంగా పరిగణించిన పార్టీ నాయకత్వం, వాస్తవాలను వివరించాలని ఎంపీని కోరింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ అంశాన్ని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే వరకు ఎంపీ మహేష్ కుమార్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు.
నిర్ణీత సమయంలోగా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వని పక్షంలో, పార్టీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పార్టీ హెచ్చరించింది. మాదకద్రవ్యాల వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల పట్ల తమ పార్టీ 'జీరో టాలరెన్స్' (సహించేది లేదు) విధానాన్ని అనుసరిస్తుందని పల్లా శ్రీనివాసరావు పునరుద్ఘాటించారు. వ్యక్తుల వ్యక్తిగత ప్రవర్తన వల్ల పార్టీ వ్యవస్థాగత ప్రతిష్టకు ముప్పు వాటిల్లకూడదని, ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవడమే తమ ప్రాధాన్యతని ఆయన పేర్కొన్నారు. ఎంపీ ఇచ్చే వివరణ మరియు పార్టీ అంతర్గత విచారణ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.