ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘనవిజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఈ ఉత్సాహంలో భాగంగా ఆదివారం రాత్రి విజయవాడలోని ఎంజీ రోడ్డులో క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున విజయ ర్యాలీ నిర్వహించారు. భారత జట్టు విజయం సాధించిన వెంటనే పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు రోడ్లపైకి వచ్చి త్రివర్ణ పతాకాలతో సందడి చేశారు.
యువత చేపట్టిన ఈ ర్యాలీ ఎంజీ రోడ్డు నుండి బెంజ్ సర్కిల్ వరకు చేరుకోవడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. శాంతియుతంగా ఉండాలని కోరినప్పటికీ, రద్దీ పెరగడంతో ట్రాఫిక్ క్లియర్ చేయడం పోలీసులకు సవాలుగా మారింది.
ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ను అదుపు చేసేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ (కెనింగ్) చేశారు. దీంతో ర్యాలీలో ఉన్న యువత ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. ఆనందోత్సాహాల మధ్య ఉన్న తమపై పోలీసులు లాఠీలు ఝుళిపించడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. అయితే, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే తాము లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీసులు వివరణ ఇచ్చారు.