YSRCP: వైసీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదు: సజ్జల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

By అంజి  Published on  12 March 2023 9:30 AM GMT
Sajjala Ramakrishna reddy, YCP foundation day

వైసీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదు: సజ్జల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని ఆదర్శంగా నడిపిస్తున్నారన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు వైఎస్ జగన్ అని, రాష్ట్ర ప్రజలకు పారదర్శకంగా పాలన అందిస్తున్నారన్నారు. విద్య, ఆరోగ్య రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. రాష్ట్రంలోని అణగారిన వర్గాలకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్‌సీపీ రోల్‌ మోడల్‌ అని, వైఎస్సార్‌సీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదని సజ్జల అన్నారు.

వైఎస్సార్‌సీపీ 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేయడం, కేక్‌ కట్‌ చేయడం, అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. 2011 మార్చి 12న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్‌ఆర్‌సీపీ తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. 2010 డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి కడప పార్లమెంటు సభ్యురాలు, పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ వరుసగా రాజీనామా చేశారు. అనంతరం ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో వీరిద్దరూ అఖండ మెజారిటీతో గెలుపొందారు.

Next Story