గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణను మరింత పటిష్టం చేస్తూ, గ్రామ, వార్డు సచివాలయాల పేరును ‘స్వర్ణ గ్రామం...
By - అంజి |
గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణను మరింత పటిష్టం చేస్తూ, గ్రామ, వార్డు సచివాలయాల పేరును ‘స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు’ కార్యాలయాలుగా మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనమండలిలో బుధవారం ఆమోదం లభించింది. ఈ సందర్భంగా సంబంధిత శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు త్వరలోనే ప్రమోషన్లు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
గతంలో కేవలం ఒకే హోదాలో కొనసాగుతున్న ఉద్యోగులకు ఇది పెద్ద ఊరటనివ్వనుంది. ఈ కార్యాలయాల పనితీరును మెరుగుపరిచేందుకు, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం మూడంచెల (Three-tier) పర్యవేక్షణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల ప్రజలకు అందే సేవల్లో జాప్యం తగ్గుతుందని మంత్రి వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందని, పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను దారిమళ్లించారని మంత్రి విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధులను నేరుగా పంచాయతీలకే ఇచ్చి, గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. 2047 నాటికి 'స్వర్ణాంధ్ర'గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగానే ఈ కార్యాలయాల పేర్ల మార్పు మరియు వ్యవస్థ పటిష్ఠీకరణ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఉన్న లోపభూయిష్టమైన వ్యవస్థను ప్రక్షాళన చేసి, ప్రజలకు మెరుగైన సేవలను చేరువ చేయడమే ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ప్రజల అవసరాల కోసం సచివాలయ వ్యవస్థను కేవలం రాజకీయ కేంద్రాలుగా కాకుండా, నిజమైన సేవా కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.