రామతీర్థం వద్ద భక్తులను కార్తీక పౌర్ణమి స్నానానికి పోలీసులు అనుమతించడం లేదు. సముద్రం నీటిలో మునగకుండా కేవలం సముద్రం నీటిని నెత్తిన చల్లుకొని రావాలని కోరుతున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచే మెరైన్ పోలీసులు, రామతీర్థ ఎస్ఐ ఆధ్వర్యంలో బీచ్ వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అప్పటికే కొందరు మహిళలు సముద్రంలోకి వెళ్లడంతో వారిన పోలీసులు కాపాడారు.
సముద్రం పోటు మీద ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు నగరానికి 20 కిలో మీటర్ల దూరంలో రామతీర్థం ఉంది. పురాతనమైన శ్రీ రామచంద్ర స్వామి ఆలయం ఉంది. పురాణాల ప్రకారం సీతాదేవిని వెతుకుతున్న సమయంలో శ్రీరాముడు ఈ ప్రదేశంలో ఒక రాత్రి బస చేశాడని చెబుతారు. తెల్లవారుజామున శ్రీరాముడు తన చేతులతో సైకత శివలింగాన్ని రూపుదిద్ది ప్రార్థనలు చేసినట్లు ప్రతీతి. ఈ కారణంగా ఈ ప్రదేశానికి గొప్ప ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది.