నేటి నుంచే ఆన్లైన్ క్లాసులు
Online Class starts from today.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు నేటి (జూన్ 12) నుంచి ఆన్లైన్
By తోట వంశీ కుమార్ Published on 12 Jun 2021 11:01 AM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు నేటి (జూన్ 12) నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సూచించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులకు మార్గదర్శకాలు పంపింది. దూరదర్శన్, రేడియో, యూట్యూబ్, వాట్సాప్ తదితర ఆన్లైన్ మాధ్యమాల ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని సూచించింది. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు.. ఉపాధ్యాయులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ అన్ని తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది
కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు జూన్ 30 కు వేసవి సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 1 నుంచి 10వ తరగతి వరకు సవివర అకడమిక్ క్యాలెండర్ను, కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అందుబాటులో ఉన్న ఆన్లైన్ మాధ్యమాలు పాఠాలు బోదించాలని సూచించింది. శనివారం నుంచి ప్రారంభించే ఈ ఆన్లైన్ తరగతులకు ఎంతమంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చారో అనే విషయాలను ఎంఈవోలకు, ఉప విద్యాధికారులకు ప్రధానోపాధ్యాయులు తెలపాలని నిర్దేశించింది. ఆన్లైన్ తరగతుల ప్రణాళిక, నిర్వహణ సమాచారాన్ని ఎంఈవోలు, ఉప విద్యాధికారులకు, అక్కడినుంచి రాష్ట్ర కార్యాలయానికి తప్పనిసరిగా తెలిపాలని పేర్కొంది.