విజయనగరం ISIS కుట్ర కేసు: మరో ఇద్దరిపై NIA చార్జిషీట్
2025లో వెలుగులోకి వచ్చిన విజయనగరం ISIS ఉగ్రవాద కుట్ర కేసులో NIA శుక్రవారం విశాఖపట్నంలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అనుబంధ చార్జిషీట్ను సమర్పించింది.
By - అంజి |
విజయనగరం ISIS కుట్ర కేసు: మరో ఇద్దరిపై NIA చార్జిషీట్
2025లో వెలుగులోకి వచ్చిన విజయనగరం ISIS ఉగ్రవాద కుట్ర కేసులో NIA శుక్రవారం విశాఖపట్నంలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అనుబంధ చార్జిషీట్ను సమర్పించింది. ఇందులో ఆరిఫ్ హుస్సేన్ (అలియాస్ అబు తాలిబ్) మరియు ఇమ్రాన్ అక్రమ్ అనే ఇద్దరు వ్యక్తులను నిందితులుగా పేర్కొంది. నిందితులపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం, భారతీయ న్యాయ సంహిత, పేలుడు పదార్థాల నియంత్రణ చట్టం, అక్రమ ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఇమ్రాన్ అక్రమ్ కీలక పాత్ర పోషించినట్లు NIA గుర్తించింది.
గతంలో పట్టుబడిన సిరాజ్ ఉర్ రహిమాన్ మరియు సయ్యద్ సమీర్లకు పేలుడు పదార్థాలు కొనుగోలు చేయడానికి కావాల్సిన ఆర్థిక సాయం ఇమ్రాన్ అందించాడు. ప్రస్తుతం ఇతను పరారీలో ఉన్నాడు. బీహార్కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ను 2025 ఆగస్టు 27న ఢిల్లీ విమానాశ్రయం నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు కావాల్సిన ఆయుధాలను సరఫరా చేసేందుకు ఇతను సిరాజ్తో కలిసి కుట్ర పన్నాడు. సరిహద్దుల గుండా అక్రమంగా ఆయుధాలను తరలించడంలో ఇతను సిద్ధహస్తుడని విచారణలో తేలింది.
సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద జిహాదీ భావజాలాన్ని ప్రచారం చేస్తూ యువతను తప్పుదోవ పట్టించేవాడు. ఈ కేసు తొలుత విజయనగరం పోలీస్ స్టేషన్లో నమోదైంది. సిరాజ్ ఉర్ రహిమాన్ మరియు సయ్యద్ సమీర్లను అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. 2025 నవంబర్లో NIA ఈ కేసును అధికారికంగా స్వీకరించి, విచారణను వేగవంతం చేస్తూ మొదటి చార్జిషీట్ను దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసులో ఇతర నెట్వర్క్ సంబంధాలపై NIA ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది.