కోడి కత్తి కేసు విచారణ ఎప్పటికి వాయిదా వేశారంటే..?
ఏపీ సీఎం వైఎస్ జగన్పై కోడికత్తి దాడికి సంబంధించిన విచారణ ఎన్ఐఏ కోర్టులో కొనసాగుతోంది. ఈ రోజు విచారణ
By అంజి Published on 13 April 2023 4:15 PM IST
కోడి కత్తి కేసు విచారణ ఎప్పటికి వాయిదా వేశారంటే..?
ఏపీ సీఎం వైఎస్ జగన్పై కోడికత్తి దాడికి సంబంధించిన విచారణ ఎన్ఐఏ కోర్టులో కొనసాగుతోంది. ఈ రోజు విచారణ జరగ్గా ఎన్ఐఏ కౌంటర్ దాఖలు చేసింది. కోడికత్తి కేసులో కుట్ర కోణం లేదని ఎన్ఐఏ తెలిపింది. రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ కు ఘటనతో సంబంధం లేదని, నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని తేలిందని కౌంటర్ పిటిషన్ లో ఎన్ఐఏ చెప్పింది. కోర్టులో విచారణ ప్రారంభమవ్వడంతో దర్యాప్తు అవసరం లేదని తెలిపింది. జగన్ వేసిన పిటిషన్ను కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించింది. వాదనలు వినిపించేందుకు తమకు సమయం కావాలని కోర్టును జగన్ తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది.
నిందితుడు తరపున న్యాయవాది అబ్దుస్ సలీం కౌంటర్ దాఖలు చేశారు. గత వాయిదాలో ఈ కేసును కుట్ర కోణంలో విచారించేలా ఆదేశించాలని కోరుతూ సీఎం జగన్ పిటిషన్పై సలీం కౌంటర్ దాఖలు చేశారు. అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ పీపీ విశాల్ గౌతమ్ కూడా కౌంటర్ దాఖలు చేశారు. రెండు కౌంటర్లలో ప్రత్యక్ష సాక్షి, బాధితుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఇంకా లోతుగా విచారణ చెయ్యాలని వేసిన పిటిషన్ను కొట్టివేయాలని కోరుతూ కౌంటర్లు వేశారు. సంఘటనలో కుట్ర కోణం ఏదీ లేదని సుదీర్ఘ దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ స్పష్టం చేసింది.