ఏపీలో నేషనల్ హైవేల విస్తరణ: రాజమహేంద్రవరం - అనకాపల్లి మధ్య 6 వరుసల రహదారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాజమహేంద్రవరం నుండి అనకాపల్లి వరకు ఉన్న 16వ...
By - అంజి |
ఏపీలో నేషనల్ హైవేల విస్తరణ: రాజమహేంద్రవరం - అనకాపల్లి 6 వరుసల రహదారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాజమహేంద్రవరం నుండి అనకాపల్లి వరకు ఉన్న 16వ నంబర్ జాతీయ రహదారిని (NH-16) నాలుగు వరుసల నుండి ఆరు వరుసలకు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నై-కోల్కతా కారిడార్లో కీలకమైన ఈ 161 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణకు సుమారు రూ.10,230 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి, అలైన్మెంట్ ఆమోదం కోసం కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖకు పంపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.
ఈ విస్తరణలో భాగంగా ట్రాఫిక్ ఇబ్బందులను నివారించేందుకు ఐదు ప్రధాన ప్రాంతాల్లో మొత్తం 36.38 కిలోమీటర్ల మేర కొత్త బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు. జగ్గంపేట (10.70 కి.మీ), తుని (11 కి.మీ), కశింకోట-అనకాపల్లి (8.38 కి.మీ), నక్కపల్లి (3.30 కి.మీ) మరియు ఎర్రవరం (3 కి.మీ) వద్ద ఈ బైపాస్ మార్గాలను ప్రతిపాదించారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం సుమారు 368 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు. ఇప్పటికే అనకాపల్లి నుండి నరసన్నపేట వరకు ఆరు వరుసల రహదారి అందుబాటులో ఉన్నందున, తాజా విస్తరణతో రాజమహేంద్రవరం వరకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
మరోవైపు, పోర్టుల అనుసంధానతను పెంచే లక్ష్యంతో అన్నవరం - వాకలపూడి మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే పనులు కూడా ప్రారంభమయ్యాయి. సుమారు రూ.988 కోట్ల అంచనా వ్యయంతో 40.62 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి దాదాపు భూసేకరణ పూర్తి కావడంతో కాంట్రాక్ట్ సంస్థ పనులను వేగవంతం చేసింది. వచ్చే రెండేళ్లలో ఈ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. ఈ కొత్త రహదారులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరియు పారిశ్రామిక రవాణాకు వెన్నుముకగా నిలవనున్నాయి.