డ్రగ్స్ కేసు వ్యవహారం.. టీడీపీకి ఎంపీ పుట్టా మహేష్ వివరణ
హైదరాబాద్లోని మొయినాబాద్ శివారులో ఉన్న ఒక ఫాంహౌస్లో ఇటీవల జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది.
By - అంజి |
డ్రగ్స్ కేసు వ్యవహారం.. టీడీపీకి ఎంపీ పుట్టా మహేష్ వివరణ
హైదరాబాద్లోని మొయినాబాద్ శివారులో ఉన్న ఒక ఫాంహౌస్లో ఇటీవల జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ యాదవ్ తాజాగా తెలుగుదేశం పార్టీ (TDP) నాయకత్వానికి తన వివరణను సమర్పించారు. శుక్రవారం నాడు ఆయన ఒక సీల్డ్ కవర్లో తన వివరణాత్మక నివేదికను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పంపారు. పార్టీ క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకుని, పల్లా శ్రీనివాస్ ఆ నివేదికను నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలనకు పంపించారు. కాగా డిన్నర్ కోసం పిలిస్తే అక్కడికి వెళ్లానని, డ్రగ్స్ తీసుకోలేదని పుట్టా స్పష్టం చేశారు.
కొద్దిరోజుల క్రితం మొయినాబాద్లోని ఒక ఫాంహౌస్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో తెలంగాణ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎంపీ మహేష్ యాదవ్తో పాటు మరికొందరు పోలీసులకు చిక్కారు. అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో (రక్త నమూనాలు), మహేష్ యాదవ్ డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండటంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై తీవ్రంగా స్పందించారు. తక్షణమే ఎంపీ నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఆదేశించారు.
ప్రస్తుతం ఎంపీ ఇచ్చిన వివరణపై చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. డ్రగ్స్ వంటి సామాజిక రుగ్మతల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుందని ఇప్పటికే సిఎం స్పష్టం చేసిన నేపథ్యంలో, ఎంపీ వివరణ సంతృప్తికరంగా లేకపోతే పార్టీ పరంగా చర్యలు ఉండే అవకాశం ఉంది. మరోవైపు, ఈ కేసులో తెలంగాణ పోలీసులు తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.