నిమ్మగడ్డ రమేష్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి: మంత్రి నాని
Minister Nani Sensational Comments on Nimmagadda Ramesh .. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మరోసా
By సుభాష్ Published on 19 Nov 2020 2:39 PM IST
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు మధ్య మరోసారి వివాదాన్ని రాజేస్తోంది. గవర్నర్ లేఖ ద్వారా తనపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేయడంపై మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రబ్బర్ స్టాంప్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఆ లేఖ టీడీపీ కార్యాలయం నుంచి వచ్చినట్లు సమాచారమని, నిమ్మగడ్డ వెనుక కొందరున్నారని ఆయన ఆరోపించారు. నిమ్మగడ్డ ఆశయాలకన్నా మాకు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ముఖ్యమన్నారు. సీఆర్డీఏ బిల్లు రద్దుపై గవర్నర్ ఆర్డినెన్స్ చెల్లదంటూ గవర్నర్ను దూషించిన చంద్రబాబుపై చర్యలు తీసుకుంటే ప్రతిపక్ష హోదా ఉండేది కాదన్నారు. రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తుల పట్ల నాకు ఎప్పుడూ గౌరవమేనని, నిమ్మగడ్డ రాజ్యాంగ పదవిలో ఉన్నానని మర్చిపోయి చంద్రబాబు ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా లేదని మంత్రి నాని స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ చంద్రబాబు లేఖలకు స్పందిస్తూ ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటన్నారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు సిద్ధంగా లేని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ చిల్లర రాజకీయాలు చేయకుండా హుందాగా ఉండాలని హితవు పలికారు. హైదరాబాద్లో కూర్చొనే అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్ అని సెటైర్ వేశారు.