వారాహి అమ్మవారే పవన్‌ను శిక్షిస్తుంది: మంత్రి కొట్టు సత్యనారాయణ

లారీని లారీ అనక ఇంకేమంటారని మంత్రి కొట్టు సత్యనారాయణ నిలదీశారు.

By Srikanth Gundamalla
Published on : 2 July 2023 6:11 PM IST

Minister, Kottu Satyanarayana, Pawan Kalyan, Varahi,

వారాహి అమ్మవారే పవన్‌ను శిక్షిస్తుంది: మంత్రి కొట్టు సత్యనారాయణ

ఏపీలో పోలిటికల్‌ హీట్‌ పెరిగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్ వారాహి యాత్రలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇక అధికారంలో ఉన్న వైసీపీ మంత్రులు కూడా పవన్‌కు గట్టి కౌంటర్‌ ఇస్తున్నారు. ఇటీవల పవన్‌ వారాహి యాత్రపై సీఎం జగన్ మాట్లాడారు. పవన్‌ వాహనాన్ని జగన్ లారీ అన్నారు. జగన్ వ్యాఖ్యలపై స్పందించిన పవన్‌ కళ్యాణ్.. సీఎంకు తెలుగు రాదంటూ ఎద్దేవా చేశారు. తాజాగా ఇదే అంశంలో పవన్‌ కళ్యాణ్‌పై మండిపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ.

తాడేపల్లి నియోజకవర్గంలో అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబుకి పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉంటున్నారని ఆరోపించారు. ఎందుకు బాబుకి పవన్‌ సపోర్ట్‌గా ఉంటారో ఎవరికీ అర్థం కాదని వ్యాఖ్యానించారు. పవన్‌ కళ్యాణ్‌ వారాహి అని తన ప్రచార వాహనానికి పేరుపెట్టుకున్నారు. అది లారీనే అన్నారు. లారీని లారీ అనక ఇంకేమంటారని మంత్రి కొట్టు సత్యనారాయణ నిలదీశారు. తన వాహనానికి వారాహి అని పేరు పెట్టుకుని.. ఆ వాహనం ఎక్కే అసత్యాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పవన్‌ చెప్పే అసత్యాలను వారాహి అమ్మవారు గమనిస్తున్నారని..అమ్మవారే పవన్‌ కళ్యాణ్‌ను శిక్షిస్తుందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

చంద్రబాబు అధికారంలో ఉంటేనే పవన్‌కు ప్యాకేజీ వస్తుందని కొట్టు సత్యానారయణ వ్యాఖ్యానించారు. అందుకే పవన్‌ చంద్రబాబుకి మద్దతు పలుకుతారని అన్నారు. ఏపీ ప్రజల సంక్షేమం, పిల్లల భవిష్యత్‌ కోసం ఆలోచించే ఏకైక సీఎం జగన్‌ అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

Next Story