ఏపీ వ్యవసాయ బడ్జెట్.. రైతులకు గుడ్న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్న
రూ.48,340 కోట్లతో మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
By అంజి Published on 28 Feb 2025 12:22 PM IST
ఏపీ వ్యవసాయ బడ్జెట్.. రైతులకు గుడ్న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్న
అమరావతి: రూ.48,340 కోట్లతో మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం లాభదాయకంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. వ్యవసాయ రంగంలో 15 శాతం వృద్ధి తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. కొత్త కౌలు చట్టం తీసుకొస్తామన్నారు. రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యలు కేటాయించి పథకాలు అమలు చేస్తామని మంత్రి అచ్చెన్న పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు వ్యవసాయినికి 35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశామని మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్ల వినియోగం తీసుకువచ్చామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.
గ్రోత్ ఇంజిన్లుగా 11 పంటలని, ఎరువుల నిర్వహణకు రూ.40 కోట్లు కేటియించినట్లు చెప్పారు. ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహానికి రూ.61 కోట్లు, వ్యవసాయ యంత్రాల రాయితీకి రూ.139 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 7.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశామని మంత్రి అచ్చెన్న తెలిపారు. డ్రోన్ల రాయితీ కోసం రూ.80 కోట్లు కేటాయించామన్నారు. 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219 కోట్లు, విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.250 కోట్లు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ అమలుకు రూ.9,400 కోట్లు, ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు కేటాయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.v