ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రాయపూడి సమీపంలోని ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రాజధాని నిర్మాణ పనుల కోసం మేఘా ఇంజినీరింగ్ కంపెనీ అక్కడ నిల్వ ఉంచిన పైపులకు ఒక్కసారిగా నిప్పంటుకోవడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, కంపెనీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే మూడు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి. అయితే, దట్టమైన పొగతో పాటు మంటలు ఉధృతంగా ఉండటంతో వాటిని అదుపులోకి తీసుకురావడం సిబ్బందికి కష్టతరంగా మారింది.
కొద్దిరోజుల క్రితమే వెలగపూడి సమీపంలో ఎల్అండ్టీ కంపెనీకి చెందిన కోట్లాది రూపాయల విలువైన హెచ్డీపీఈ (HDPE) పైపులు కూడా ఇదే తరహాలో అగ్నికి ఆహుతయ్యాయి. వరుసగా జరుగుతున్న ఈ అగ్నిప్రమాదాలు ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఎల్అండ్టీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించగా, ఆ విచారణ పూర్తికాకముందే మేఘా కంపెనీ పైపులు దగ్ధం కావడం గమనార్హం. ఈ ఘటనల వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా లేదా గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల ఇవి జరుగుతున్నాయా అనే కోణంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.