మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ తీరుపై వైఎస్ సునీత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీబీఐ బాధ్యతాయుతంగా, లోతుగా దర్యాప్తు చేయలేదని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో తనకు అందరూ అన్యాయం చేస్తున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులు చెప్పింది వినడమే తప్ప సీబీఐ లోతుగా దర్యాప్తు జరపలేదన్నారు. హత్యకు ముందు, తర్వాత నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను ఏమాత్రం సీరియస్గా తీసుకోలేదని, సాక్షిలో గుండెపోటు వార్త రావడానికి నిమిషం ముందే కిరణ్ యాదవ్ అనే వ్యక్తి అర్జున్రెడ్డికి మెసేజ్ పంపాడు. ఈ కీలక ఆధారాన్ని సీబీఐ ఎందుకు లోతుగా పరిశీలించలేదని ఆమె ప్రశ్నించారు. తాను కోర్టుతో పాటు సీబీఐకి కూడా అదనపు ఆధారాలు సమర్పించినప్పటికీ, వాటిపై కూడా సరైన విచారణ జరగలేదని సునీత ఆరోపించారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన భార్య భారతిని విచారించాల్సిన అవసరం ఉందని, కానీ సీబీఐ వారిని విచారించలేదని అన్నారు.