ఏపీలో 19 మంది ఐఏఎస్‌లు, ఇద్దరు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

ఏపీలో భారీగా పలువురు ఐఏఎస్, ఐపీఎల్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.

By Srikanth Gundamalla  Published on  11 July 2024 1:45 PM GMT
ias, ips, officers, transferred,  andhra pradesh,

ఏపీలో 19 మంది ఐఏఎస్‌లు, ఇద్దరు ఐపీఎస్‌ అధికారుల బదిలీ 

ఏపీలో భారీగా పలువురు ఐఏఎస్, ఐపీఎల్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. స్సెషల్ సీఎస్ ఆర్‌పీ సిసోడియాను రెవెన్యూ అండ్ ల్యాండ్స్, రిజిష్ట్రేషన్‌కు బదిలీ చేసింది. ఇక ప్రస్తుతం మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న జీ.జయలక్ష్మిని సీసీఎల్ఏకు బదిలీ చేసింది.

అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జి.అనంతరాము, ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శిగా కాంతిలాల్ దండే, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కార్యదర్శిగా సురేశ్ కుమార్‌లను బదిలీ చేశారు. సురేశ్ కుమార్‌కు గ్రామ వార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. జీఏడీ కార్యదర్శిగా కూడా సురేశ్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు.

ఐటీ శాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శిగా యువరాజ్ నియామకం అయ్యారు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా హర్షవర్ధన్, వెనుకబడిన తరగతుల సంక్షేమ కార్యదర్శిగా పి.భాస్కర్‌లను బదిలీ చేశారు. పి.భాస్కర్‌కు ఈడబ్ల్యుఎస్, జీఏడీ సర్వీసెస్ అదనపు బాధ్యతలను అప్పగించారు. సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా కె.కన్నబాబును బదిలీ అవ్వగా.. ఆయనకు గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌గాను బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం. వీరితోపాటు మరికొందరు ఐఏఎస్‌లను బదిలీ చేశారు.

రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హోం సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తాను విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టర్ జనరల్, జీఏడీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా బదిలీ చేసింది. ఇక కుమార్ విశ్వజిత్‌ను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ట్రాన్స్‌ఫర్ చేసింది.

Next Story