అమెరికాలో రోడ్డు ప్రమాదం.. గుంటూరు విద్యార్థిని మృతి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గుంటూరుకు చెందిన ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉదంతం విషాదాన్ని నింపింది.

By -  అంజి
Published on : 12 April 2026 8:50 AM IST

Navya Nelakuditi, Guntur Student US Death, Pittsburgh Car Accident, Telugu Student US Accident, GoFundMe Navya, UPMC Presbyterian Hospital, Student Repatriation

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. గుంటూరు విద్యార్థిని మృతి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గుంటూరుకు చెందిన ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉదంతం విషాదాన్ని నింపింది. మాస్టర్స్ చదువుతున్న 23 ఏళ్ల నవ్య నీలకుడిటి, పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో చికిత్స పొందుతూ ఏప్రిల్ 9న తుదిశ్వాస విడిచారు. మిచిగాన్‌లో ఇంటర్న్‌షిప్ ఇంటర్వ్యూ ముగించుకుని తిరిగి వస్తుండగా, ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నవ్యను పిట్స్‌బర్గ్‌లోని యూపీఎంసీ ప్రెస్బిటేరియన్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ నవ్యకు మూడు ప్రధాన శస్త్రచికిత్సలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. నవ్య మరణవార్తను ఆమె అత్త శిరీష నీలకుడిటి 'గోఫండ్‌మీ' (GoFundMe) పోస్ట్ ద్వారా ధృవీకరించారు. భారతదేశంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నవ్య, గతేడాది తన మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికాకు వెళ్లారు. తమకున్నదంతా పెట్టుబడిగా పెట్టి తల్లిదండ్రులు ఆమెను చదివిస్తుండగా, నవ్య కూడా ఎంతో కష్టపడి తన కెరీర్‌ను నిర్మించుకునే ప్రయత్నంలో ఉండేవారు. ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలనే ఆమె కల ఈ ప్రమాదంతో అర్థాంతరంగా ముగిసిపోయింది.

ప్రస్తుతం ఆమె అంత్యక్రియలు, మృతదేహాన్ని స్వదేశానికి పంపించే ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు నిధులను సేకరిస్తున్నారు. ఇప్పటివరకు దాతల ద్వారా సుమారు 37,000 డాలర్ల కంటే ఎక్కువ నిధులు సమకూరినట్లు సమాచారం. విదేశాల్లో ఉన్న తెలుగు యువతి అకాల మరణం కుటుంబాన్ని, స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.

Next Story