కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్ర‌భుత్వం

Good news to contract employees in ap.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా క‌ష్టకాలంలో ఏపీలోని కాంట్రాక్టు ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 May 2021 9:12 AM GMT
CM Jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి క‌రోనా క‌ష్టకాలంలో ఏపీలోని కాంట్రాక్టు ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. రాష్ట్రంలోని 8 శాఖ‌ల్లో ప‌ని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల‌కు సంబంధించి కీల‌క ఆదేశాలు జారీ చేసింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆయా శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కాలపరిమితిని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగానే పరిగణలోకి తీసుకోవాలని, సకాలంలో జీతాలు చెల్లించాలని గతంలోనే సీఎం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు పర్మినెంట్ ఉద్యోగులకు కల్పించే ప్రయోజనాలు అన్ని కూడా వారికి అందించేలా నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.

'వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం' కింద నేడు మొదటి విడతగా రూ.7500 చొప్పున రైతుల ఖాతాల్లో సీఎం జ‌గ‌న్ లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో రైతు భరోసా పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతోనే నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 52.38 లక్షల మంది రైతులకు రూ. 3,928 కోట్ల సాయం అందించినట్లు ఆయన తెలిపారు.

రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకంలో మూడో ఏడాదికి తొలి విడత సాయం చేస్తున్నామన్నారు. అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా మూడు విడతలుగా రూ.13,500 సాయం అందజేస్తామన్నారు. ఖరీఫ్‌ ముందు మే నెలలో తొలి విడత కింద రూ.7,500, అక్టోబర్‌లో రూ. 4,000, జనవరిలో రూ. 2,000 సాయం అందజేయనున్నట్లు చెప్పారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని సీఎం జగన్ అన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే రైతు భరోసా పథకం తీసుకొచ్చామన్నారు.

గత ప్రభుత్వం పెట్టిన విత్తన బకాయిలను కూడా చెల్లించామని చెప్పారు. ఇక రైతు భ‌రోసా కింద‌ ఇప్పటివరకు రూ.13,101 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామ‌ని.. ఈ రోజు విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం రూ.1729 కోట్లు జమ చేశామ‌ని.. 23 నెలల పాలనలో రైతులకు రూ. 68 వేల కోట్లు సాయం చేశామ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు.




Next Story