నేడు డిప్యూటీ సీఎం పవన్‌తో సినీ నిర్మాతల భేటి

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో టాలీవుడ్ అగ్ర నిర్మాతలు కలవనున్నారు.

By Srikanth Gundamalla  Published on  24 Jun 2024 1:15 AM GMT
film producers,  Andhra Pradesh, deputy cm pawan kalyan,

 నేడు డిప్యూటీ సీఎం పవన్‌తో సినీ నిర్మాతల భేటి 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. కీలక శాఖల బాధ్యతల స్వీకరణ తర్వాత అధికారులతో ఆయన వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు మరోవైపు జన దర్బార్‌ పేరుతో నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ప్రజల వద్దకు వెళ్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలసుకుంటున్నారు. వాటి పరిష్కారం కోసం అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో టాలీవుడ్ అగ్ర నిర్మాతలు ఇవాళ కలవనున్నారు. అశ్వినీదత్‌, చినబాబు, నవీన్ యర్నేని, రవి శంకర్‌, నాగ వంశీ, టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల, తెలుగు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్‌ దిల్ రాజు, దామోదర్‌ ప్రసాద్‌, భోగవల్లి ప్రసాద్‌, డీవీవీ దానయ్య ఈ సమావేశానికి హాజరు కానున్నారని సమాచారం.

ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించాయి. 165 సీట్లును సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక కొత్త ప్రభుత్వాన్ని మర్యాదపూర్వకంగా టాలీవుడ్ సినీ నిర్మాతలు కలవనున్నట్లు తెలుస్తోంది. అలాగే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, విధానాల కారణంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వివరించున్నారని సమాచారం. అలాగే టికెట్ ధరల్లో వెసులుబాటు, థియేటర్లలో ఎదురయ్యే సమస్యలు వంటి అంశాలను నిర్మాతలు పవన్ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Next Story