మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ రోజు(శుక్రవారం) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన శత్రుచర్ల.. కాంగ్రెస్ తరుపున 1989-94లో పాతనాగూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మాజీ మంత్రి, కురుసాం ఎమ్మెల్యే పుష్పశ్రీవానికి చంద్రశేఖర్ రాజు స్వయానా మావయ్య అవుతారు.
వైసీపీ ఆవిర్భావం తర్వాత శత్రుచర్ల చంద్రశేఖర్రాజు ఆ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఆయన వైసీపీకి గుడ్బై చెప్పి టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు మృతి పట్ల పలు పార్టీకి చెందిన నాయకులు సంతాపం తెలిపారు. ఆయన నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు.
చంద్రశేఖరరావు మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. శత్రుచర్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు నారా లోకేష్ పేర్కొన్నారు.