ఉలిక్కిప‌డ్డ న‌ల్ల‌మ‌ల్ల.. కృష్ణా న‌దిలో భూప్ర‌కంప‌న‌లు.. శ్రీశైలం డ్యాంకు ఎగువ‌న 44 కి.మీ దూరంలో

Earth Quake in Krishna River Near Nallamala Forest.సోమ‌వారం వేకువ జామున నల్లమలలోని కృష్ణా నదిలో స్వల్ప

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2021 1:57 AM GMT
ఉలిక్కిప‌డ్డ న‌ల్ల‌మ‌ల్ల.. కృష్ణా న‌దిలో భూప్ర‌కంప‌న‌లు.. శ్రీశైలం డ్యాంకు ఎగువ‌న 44 కి.మీ దూరంలో

సోమ‌వారం వేకువ జామున నల్లమలలోని కృష్ణా నదిలో స్వల్ప భూకంపం సంభవించింది. శ్రీశైలం జలాశయానికి పడమర వైపు 44 కిలోమీటర్ల దూరంలో, నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌కు తూర్పున 18 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. నల్లమల అడవుల్లో 7 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చినట్లు హైదరాబాద్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ వెల్లడించింది. సోమ‌వారం ఉద‌యం 5 గంట‌ల ప్రాంతంలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని ఎన్‌జీఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త శ్రీనగేశ్ చెప్పారు. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 3.7గా నమోదైంది.

భూకంపంతో నల్లమలలోని అచ్చంపేట పట్టణం, కొల్లాపూర్‌, లింగాల, అమ్రాబాద్‌, పదర, ఉప్పునుంతల, బల్మూరు మండలాలతోపాటు శ్రీశైలం సమీప గ్రామాలు, గిరిజన గూడేల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొన్ని ఇళ్లల్లోని వంటపాత్రలు, గిన్నెలు, డబ్బాలు, బొమ్మలు కిందపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో 4 సెకన్లు, మరికొన్ని చోట్ల మూడు సెకన్లు ప్రభావం చూపించింది. ఒక్కసారిగా శబ్దం రావడంతో భ‌యంతో ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశామ‌ని అక్క‌డి స్థానికులు చెప్పారు.

మరోవైపు భూకంపం నేపథ్యంలో శ్రీశైలం జలాశయం వద్ద పరిస్థితులపై అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. శ్రీశైలం డ్యాం భూగర్భ గ్యాలరీతోపాటు ఈగలపెంటలో భూ ప్రకంపనలు గుర్తించే రెండు సెన్సార్లున్నాయి. ప్రకంపనలను అవి వెంటనే గుర్తించి ఎన్‌జీఆర్‌ఐకి సంకేతాలు పంపాయి. అనంతరం ఎన్‌జీఆర్‌ఐ అధికారులు ప్రకంపనల తీవ్రతను శ్రీశైలం డ్యాం అధికారులకు పంపించారు. అయితే.. భూకంపం కారణంగా ఎలాంటి ప్రమాదం వాటిల్లక పోవడంతో శ్రీశైలం ఆనకట్టకు పెద్ద ముప్పు తప్పినట్లయింది. ఆనకట్ట నిర్మించినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతంలో భూకంపాలు ఎప్పుడూ రాలేదని, ఇదే మొదటిసారి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. నీటి నిల్వ అంతకంతకూ పెరుగుతోంది.

సాధారణంగా నీటి ప్రవాహాలతో భూమి లోపల ఉన్న పగుళ్లలో సర్దుబాటుతో భూమి కంపిస్తోంది. దీన్నే టెక్టానిక్‌ ఎఫెక్ట్‌ అని అంటారని, ఇలాంటి సందర్భాల్లో ఎక్కువసార్లు భూమి కంపిస్తుంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పులిచింతలలో గతేడాది జనవరి నుంచి నవంబరు వరకు ఇలాంటి భూ ప్రకంపనలు ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ భూమి పొరల్లోని పగుళ్లలో నీటి సర్దుబాటే కారణమని నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం శ్రీశైలం ఆనకట్టకు దగ్గరలో భూకంపం ఒక్కసారే వచ్చిందని, భూమి లోపల రాతిపొరల్లో ఒత్తిడి భూకంపానికి కారణమని అంచనా వేస్తున్నారు. రాత్రి వరకు మళ్లీ ప్రకంపనలు వచ్చినట్లు రికార్డు కాలేదని, దీన్నిబట్టి వరదతో వచ్చిన ప్రకంపనలు అనుకోలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Next Story