వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి రాజధాని అమరావతి మహిళలను అవమానించారని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీజీపీకి లేఖ రాశారు. సంకరజాతి అంటూ కులవివక్షకు సంబంధించిన పదాన్ని ఆయన వాడారని రఘురామ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కేసు నమోదు చేయాలని కోరారు. ఇలాంటి అవమానకర భాషను ఎవరూ వాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
సజ్జల దూషణలు అమరావతిలోని వేలాది మంది మనోభావాలను దెబ్బతీశాయన్నారు. అమరావతిపై టీవీ ఛానల్లో జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతుండగానే సజ్జల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నిరసనలు చేసిన మహిళలను సంకర తెగ అంటూ మండిపడ్డారు. వారిని పిశాచాలు, రాక్షసులతో పోలుస్తూ పరుష పదజాలం ఉపయోగించారు. దీనిపై మహిళల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.