అప్పుడే ఖాళీ అయిన శ్రీశైలం జలాశయం..!

Dead storage in Srisailam.శ్రీశైలం జలాశయం కూడా ఖాళీ అయింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2021 7:35 AM GMT
Srisailam storage

ప్రస్తుతం ఎండలు ఎంతగా మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..! వర్షాలు వచ్చి చాలా రోజులే అవుతోంది. దీంతో పలు జలాశయాలు ఎండిపోతూ ఉన్నాయి. ఇప్పుడు శ్రీశైలం జలాశయం కూడా ఖాళీ అయింది. గడచిన వర్షాకాలంలో భారీ వరదలు రాలేదన్న సంగతి తెలిసిందే..! 2019, 2020 ఆరంభంలో వచ్చిన వరదల నీరే శ్రీశైలం జలాశయంలో ఉన్నాయి. ఇప్పుడు అది కూడా ఖాళీ అయింది. శ్రీశైలం రిజర్వాయర్ లో కనీస నీటి మట్టం 834 అడుగులు కాగా, ప్రస్తుతం 812 అడుగులు మాత్రమే నీరుంది. దీంతో జలాశయం వెలవెలబోతోంది.

ఈ సంవత్సరం కృష్ణా, గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ నీటితో నిండిపోయాయి. కృష్ణా బేసిన్ లో ఏకంగా 1,280 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టులో మొత్తం నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ఇప్పుడు కేవలం 35.73 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ సంవత్సరం నీటి నిల్వను కనీస మట్టం కన్నా కిందకు తగ్గకుండా చూడాలని గతంలో జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నా, వేసవి ఇంకా పూర్తిగా ఆరంభం రాకముందే నీరు కనీస మట్టాని కన్నా కిందకు పడిపోయింది.

శ్రీశైలం జలాశయం వద్ద విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే నిలిచిపోగా, జలాశయం నుంచి నీరు వెళ్లే ఎత్తిపోతల పథకాలకు నీటిని లిఫ్ట్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఏప్రిల్ 9న కృష్ణా బోర్డు ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు సమాచారాన్ని పంపనుంది. రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్న జలాశయాల్లో ఉన్న నీటి వివరాలు, వాటిని వాడుకున్న తీరుపై అవసరమైన మొత్తం సమాచారాన్ని తమకు అందించాలని కోరింది. అన్ని అంశాలపై త్రిసభ్య కమిటీతో కూడిన బోర్డు చర్చించి, ఆపై మిగులు నీటి పంపిణీపై నిర్ణయాలు తీసుకోనున్నారు.


Next Story