అసని తుఫాను కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. తీరప్రాంతాల్లో భారీ అలలు ఎగిసిపడుతున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఇదిలా ఉంటే.. శ్రీకాకుళం జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. తుపాను కారణంగా సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు ఓ రథం కొట్టుకు వచ్చింది. బంగారు వర్ణంలో ఉన్న ఈ రథం విదేశాలకు చెందినగా తెలుస్తోంది. ఈ రథంపై 16-1-2022 తో పాటు విదేశీభాష కనిపిస్తోంది. ఇది మలేషియా, థాయిలాండ్, జపాన్ దేశాలకు చెందినదై ఉండొచ్చునని బావిస్తున్నారు.
కాగా.. హుదూద్, తిత్లీ వంటి పెను తుపానులు వచ్చినప్పుడు కూడా ఇలాంటివి ఎప్పుడూ కొట్టుకుని రాలేదని మత్స్యకారులు చెబుతున్నారు. సముద్రంలో ఇంత దూరం రథం కొట్టుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ రథాన్ని చూసేందుకు స్థానికులు అక్కడకు పోటెత్తారు. బంగారు రథాన్ని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.