జగనన్న విద్యా దీవెన: మీ పిల్లల చదువుకు నాది బాధ్యత: సీఎం జగన్
పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు ఒక్కటేనని సీఎం జగన్ అన్నారు. కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల
By అంజి Published on 19 March 2023 1:23 PM IST
జగనన్న విద్యా దీవెన: మీ పిల్లల చదువుకు నాది బాధ్యత: సీఎం జగన్
పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు ఒక్కటేనని సీఎం జగన్ అన్నారు. కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. ఇప్పటి వరకు రూ.13,311 కోట్ల సాయం అందించామన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని వాహినీ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన జగనన్న విద్యా దీవెన కార్యాక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో కాలేజీ ఫీజులు బకాయిలు పెట్టేవారని అన్నారు. ఫీజులు కట్టలేక చదువులు మానివేసే పరిస్థితి రాకూడదని, లంచాలు, వివక్ష లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లో విద్యా దీవెన నిధులు జమ చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.
గతంలో ఫీజు రీయంబర్స్మెంట్ అరకొరగా ఇచ్చే వారని, ఫీజులు కట్టలేక విద్యార్థులు అవస్థలు పడేవారని అన్నారు. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయని అన్నారు. అందుకే విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ ఇస్తున్నామని అన్నారు. జగనన్న విద్యా దీవెన ద్వారా ఇప్పటి వరకు రూ.9,947 కోట్లు ఇచ్చామన్నారు. 27 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చమన్నారు. చంద్రబాబు హయాంలోని బకాయిలను సైతం చెల్లించామన్నారు. విద్యా దీవెనతో పాటు వసతి దీవెన కూడా ఇస్తున్నామని, తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడం ద్వారా ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. కాలేజీలో సమస్యలు ఉంటే 1092 ఫిర్యాదు చేస్తే తాము మాట్లాడతామని తెలిపారు.
పేదలు బాగుపడాలనే నవరత్నాల స్కీమ్ను ప్రవేశపెట్టామని అన్నారు. ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. ఒక కుటంబం తల రాతను మార్చే శక్తి ఒక చదువుకు మాత్రమే ఉందన్నారు. ఒక మనిషి జీవన ప్రమాణం, జీవన ప్రయాణం నిర్దేశించేది చదువేనన్నారు. కలెక్టర్ ఢిల్లీరావు సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని చెప్పారు. చదువకు పేదరికం అడ్డు కాకూడదు, దేశంలో విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు ఎక్కడా లేవని సీఎం జగన్ అన్నారు. కాలేజీ ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత మీ జగనన్నదే అని అన్నారు. ప్రభుత్వ బడులు కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడేలా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని పిల్లల చదువు బాధ్యత తనది అని సీఎం జగన్ చెప్పారు. ఈ పథకాలతో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు.