'ఫ్యామిలీ కార్డుల'పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
సంక్షేమ పథకాల పంపిణీ కోసం జూన్ నాటికి 'ఫ్యామిలీ కార్డులు' జారీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
By - అంజి |
'ఫ్యామిలీ కార్డుల'పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
సంక్షేమ పథకాల పంపిణీ కోసం జూన్ నాటికి 'ఫ్యామిలీ కార్డులు' జారీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సంక్షేమ సేవలను సమర్థవంతంగా అందించడానికి ఫ్యామిలీ కార్డ్ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా జూన్ నాటికి సమగ్ర ఫ్యామిలీ కార్డ్ జారీ చేయబడుతుందని, మార్చి నాటికి జనాభా నిర్వహణ విధానాన్ని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. వృద్ధాప్య జనాభా కారణంగా అనేక యూరోపియన్ దేశాలు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, ఆంధ్రప్రదేశ్ దీనిని నివారించడానికి ముందుగానే ప్రణాళిక వేసుకోవాలని అధికారులకు సూచించారు.
'వాట్సాప్ గవర్నెన్స్' ద్వారా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలు అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమ పథకాల పంపిణీలో మరింత పారదర్శకత, వేగం పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఫ్యామిలీ కార్డ్ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా జూన్ నెల నాటికి రాష్ట్రంలోని అర్హులందరికీ సమగ్ర ఫ్యామిలీ కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. విద్యుత్ ఛార్జీలను పెంచే ప్రసక్తే లేదని, ట్రూ-డౌన్ ఛార్జీల ద్వారా వచ్చే ప్రయోజనాలను నేరుగా వినియోగదారులకే అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చి, ఉత్పత్తిని 400 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చిన్న పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులను సరళతరం చేస్తూ 'సింగిల్ విండో' విధానాన్ని అమలు చేయాలని సూచించారు. వచ్చే ఏడాది నాటికి ఆంధ్రప్రదేశ్ను ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా ప్రకటిస్తామని వెల్లడించారు. అలాగే ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను (Normal Deliveries) ప్రోత్సహించాలని, సిజేరియన్లను తగ్గించాలని సూచించారు. రాజధాని పనుల కోసం ఇసుక, గ్రావెల్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు.