స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధిపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, బాధితులకు తక్షణ చికిత్స అందించాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

By -  అంజి
Published on : 3 Dec 2025 6:57 AM IST

CM Chandrababu Naidu, Health Department, Scrub Typhus Patients,  Scrub Typhus

స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధిపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

విజయవాడ: స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, బాధితులకు తక్షణ చికిత్స అందించాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి సౌరభ్ గౌర్‌తో కలిసి సీఎం చంద్రబాబు ఈ వ్యాధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజేశ్వరి అనే మహిళను చిగ్గర్‌ మైట్‌ అనే కీటకం కుట్టడం కారణంగా స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.

మొదట ఆమెకు టైఫాయిడ్ జ్వరం కోసం చికిత్స అందించగా, తరువాత రాపిడ్ పరీక్ష ద్వారా ఆ మహిళ స్క్రబ్ టైఫస్ వ్యాధితో మరణించిందని తేలింది. ఈ వ్యాధి ఓరియంటియా సుట్సుగముషి బాక్టీరియం వల్ల రావచ్చని, ఇది అంటువ్యాధి కాదని, జ్వరం, జలుబు, తలనొప్పి, కండరాల నొప్పులు, దద్దుర్లు వస్తాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.

అయితే సకాలంలో చికిత్స అందిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని వివరించారు. స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, వారికి వెంటనే చికిత్స అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, కీటకాలు కుట్టిన వెంటనే వైద్యులను సంప్రదించేలా అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Next Story